పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 10: తన పుట్టిన ఊరైన రాగినేడులో గ్రామస్తుల సహకారంతో శివాలయాన్ని నిర్మిస్తామని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పేర్కొన్నారు. గ్రామంలోని స్వయం భూ శివలింగం వద్ద నిర్మించనున్న దేవాలయ ప్రతిపాదిత స్థలాన్ని శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అక్కడ పూజలు చేశారు. అంతకుముందు గ్రామానికి చేరుకున్న ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కోలేటి దామోదర్ మాట్లాడుతూ, అత్యున్నత పదవి చేపట్టిన తర్వాత సొంతూరికి వచ్చిన తనకు ఆత్మీయ స్వాగతం లభించడం ఆనందంగా ఉందన్నారు.
స్నేహితుల సహకారంతో ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రామగుండం సీపీ సత్యనారాయణ, డీసీపీ పులిగిళ్ల రవీందర్ యాదవ్, దేవాదాయశాఖ అదనపు కమిషనర్ శ్రీనివాస్ రావు, రాష్ట్ర ప్రభుత్వ వాస్తు సిద్ధ్దాంత కర్త స్తపతి, వేములవాడ స్థానాచార్యులు సురేశ్, ధర్మపురి స్థానాచార్యులు రమేశ్, సర్పంచులు మల్క రేవతి, మామిడిపల్లి బాపయ్య, ఎంపీటీసీ పుప్పాల నిర్మల ఉన్నారు.