జూలపల్లి, మార్చి 28: కుమ్మరికుంట పల్లె ప్రగతితో కొత్తశోభను సంతరించుకుంటున్నది. శోభాయమానంగా పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం, వందశాతం మరుగుదొడ్లు, నర్సరీ, సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రం, డంప్యార్డు, సామాజిక మరుగుదొడ్లు, కొత్త గ్రామ పంచాయతీ భవనం, ఊరంతా సిమెంట్ రోడ్లు, హైమాస్ట్ విద్యుత్ దీపాలతో మిలమిలా మెరిసిపోతున్నది. జిల్లాలోనే తొలుత ఈ గ్రామంలోని మురుగు కాల్వలు పూడ్చి వేసి, వాటిపై మొక్కలు నాటారు.
జూలపల్లి మండలం కుమ్మరికుంట 1985లో గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. మొత్తం 10 వార్డులు ఉండగా, 2,792 మంది జనాభాలో మహిళలు 1,421, పురుషులు 1,371 మంది ఉండగా, 672 నివాసాలున్నాయి. పల్లె ప్రగతితో గ్రామ స్వరూపమే మారిపోయింది. జనాభా ప్రాతిపదికన ప్రతి ఏడాది రూ.46,90,960 లక్షల నిధులు కేటాయిస్తున్నారు.
ఇందులో రూ.2,81,015 పచ్చదనం పెంపునకు ఖర్చు చేస్తున్నారు. ఆరుగురు పంచాయతీ పారిశుధ్య కార్మికులకు నెలకు రూ.8,500 చొప్పున వేతనాలు చెల్లిస్తున్నారు. రూ. 10 లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ, వాటర్ ట్యాంకర్ కొనుగోలు చేశారు. మూడు ట్రై సైకిళ్లలో గ్రామంలోని ఇండ్లలో నిల్వ చేసిన చెత్తను తరలిస్తున్నారు. గ్రామంలోని ఇండ్లలో తడి, పొడి చెత్త నిల్వ చేసేందుకు 1400 ప్లాస్టిక్ బుట్టలు పంపిణీ చేశారు. గ్రామ శివారు లో రూ. 10 లక్షలు ఖర్చు చేసి వైకుంఠధామం నిర్మించారు. అన్ని వీధుల్లో కొత్తగా 10 స్తంభాలు ఏర్పాటు చేయగా, 300 మీటర్ల వరకు విద్యుత్ తీగలు లాగారు. 4 విద్యుత్ స్తంభాలు విరిగిపోగా తొలగించారు. దాదాపు 250 మీటర్ల దూరం మూడో తీగ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాడ వాడలా 250 విద్యుత్ దీపాలు అమర్చారు.
మూడు ప్రధాన కూడళ్లలో హైమాస్ట్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. పల్లె ప్రకృతి వనం నిర్మించి 4,500 వేల పూలు, పండ్లు, ఔషధ, నీడనిచ్చే మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. హరితహారంలో భాగంగా గ్రామంలో 34 వేల మొక్కలు నాటగా, ప్రస్తుతం 80 శాతం బతికించుకుంటున్నారు. గ్రామస్తులు కామ రాజు, ఆవుల గోపాల్, కొత్త మధు, బేరం శ్రీనివాస్, చల్ల గోపాల్, సర్పంచ్ మేచినేని సంతోష్రావు కలిసి దోమల నివారణకు రూ. 65 వేలు వెచ్చించి ఫాగింగ్ మిషన్ అందజేశారు. ఎస్సీ కాలనీలో చేతి పంపుల వద్ద సామాజిక ఇంకుడు గుంతలు తవ్వారు. మట్టి రోడ్లను సిమెంట్ రహదారులుగా తీర్చిదిద్దారు. ఊరు నుంచి వైకుంఠ దామం దాకా రూ. 2 లక్షల నిధులతో మట్టిరోడ్డు పునరుద్ధరించారు. గ్రామంలో సామాజిక మరుగుదొడ్డితోపాటు, 672 వ్యక్తిగత మరుగు దొడ్లు నిర్మించారు. ఆవాసాల్లో 500, సామాజిక ప్రదేశాల్లో 24 ఇంకుడు గుంతలు నిర్మించి వినియోగిస్తున్నారు. గతంలో కుమ్మరికుంటలో విష జ్వరాలు బాగా సోకేవి. మురుగు నీటి గుంతలు, నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోగా ప్రస్తుతం పారిశుధ్యం మెరుగు పడింది. దీంతో రోగాలు దరి చేరడం లేదు.
ఇవీ కూడా చదవండి..
వేములవాడలో అక్రమ వడ్డీ వ్యాపారులపై కొరడా
న్యాక్ హైదరాబాద్కు సీఐడీసీ అవార్డు ప్రదానం