ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలి
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి
మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
రామడుగు, ఏప్రిల్ 22: స్వీయ నియంత్రణే ప్రజలకు శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా విజృంభిస్తున్నందున ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కోరారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరించాలన్నారు. ప్రతి గ్రామంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ప్రజలను కరోనా మహమ్మారి నుంచి కాపాడేందుకు వైద్యాధికారులు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అర్హులందరికీ కొవిడ్ వ్యాక్సిన్ వేయాలని సూచించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ వేస్తారని పేర్కొన్నారు. కరోనాపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పల్లెప్రకృతి వనాలతో గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొందన్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల బాధలను ముఖ్యమంత్రి కేసీఆర్ అర్థం చేసుకొని చేయూతనివ్వడం గొప్ప విషయమన్నారు. రూ. రెండు వేలతో పాటు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. అనంతరం సమావేశంలో మూడు మాసాల ప్రగతి నివేదికను ఆయా శాఖల అధికారులు చదివి వినిపించారు.
ఇవి కూడా చదవండి
ఆలయంలోకి దూసుకెళ్లిన ట్రక్కు
ఓకే అన్న కోర్టు..వాయిస్ టెస్ట్ కి దీపు సిద్ధు