కరీంనగర్, మే 15 (నమస్తే తెలంగాణ)/ తెలంగాణ చౌక్ : లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతున్నది. నాలుగో రోజూ విజయవంతమైంది. శనివారం ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు ప్రజలు రోడ్లపై కనిపించగా, ఆ తర్వాత నిర్మానుష్య వాతావరణం కనిపించింది. ఓవైపు ఎండ, మరోవైపు లాక్డౌన్తో రోడ్లపై జనం కనిపించడం లేదు. ఇటు జిల్లాల వారీగా పోలీస్ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. పది గంటల తర్వాత తనిఖీలు చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చిన వాహనదారుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తున్నారు. అకారణంగా బయటికి వస్తే కేసులు నమోదు చేస్తున్నారు. కరీంనగరంలో డ్రోన్లతోపాటు మొబైల్ కమాండ్ కంట్రోల్ వెహికిల్ (కెమెరా బస్సు)తో పర్యవేక్షిస్తున్నారు. నగరంలో సీపీ కమలాసన్రెడ్డి పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు. సిరిసిల్లలో ఎస్పీ రాహుల్ హెగ్డే పర్యటించారు. అంబేద్కర్ చౌరస్తా, పాత బస్టాండ్లో తనిఖీలను పర్యవేక్షించారు. అన్ని జిల్లాల్లోనూ కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పల్లె, పట్నం తేడా లేకుండా అంతటా శానిటేషన్ చేస్తున్నారు. ఇటు కరీంనగర్ రీజియన్లోని పది డిపోల పరిధిలో 113 బస్సులు నడిచాయని రీజినల్ మేనేజర్ శ్రీధర్ శనివారం తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తున్నామని, ప్రతి బస్సును శానిటైజ్ చేస్తున్నామని చెప్పారు.