కరీంనగర్, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ): జిల్లాలోని మండల, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయించాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన జిల్లా అధికారులతో వేసవిలో వడగాలులతో ప్రజల రక్షణ చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవిలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే తీవ్రమైన వడగాలులు వీస్తూ ప్రజలకు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని, ప్రజలు మధ్యాహ్నం పనులు చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని ప్రాథమిక, సబ్ సెంటర్లలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రతలపై ముద్రించిన బ్యానర్లు, పోస్టర్లు ప్రదర్శించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో, వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా చేపట్టే అభివృద్ధి పనుల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స పెట్టెలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి పనులు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు చేయించాలని ఆదేశించారు. 15 రోజులకొకసారి ఉపాధి పని స్థలాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామాల్లో స్వశక్తి మహిళా సంఘాలు ఉదయం, సాయంత్రం మాత్రమే సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వేసవిలో వడదెబ్బ, నివారణ చర్యలపై ముద్రించిన బ్యానర్లు, పోస్టర్లను ప్రదర్శించాలన్నారు.
నగరపాలక సంస్థ, మున్సిపాలిటీల పరిధిలో స్వచ్ఛంద సంస్థలు, నగర పుర ప్రముఖులతో చౌరస్తాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆర్టీసీ బస్సుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్లాల్, మున్సిపల్ కమిషనర్ క్రాంతి, ముఖ్య ప్రణాళికాధికారి కొమురయ్య, డీఆర్డీవో వెంకటేశ్వర్రావు, డీఎంహెచ్వో డాక్టర్ సుజాత, డీపీవో వీర బుచ్చయ్య, ఫైర్ ఆఫీసర్ వెంకన్న, పశువైద్యాధికారి నరేందర్, వ్యవసాయాధికారి శ్రీధర్, విద్యాధికారి జనార్దన్రావు, సంక్షేమాధికారి శారద, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి నతానియల్, మైనార్టీ సంక్షేమాధికారి మధుసూదన్, కరీంనగర్, హుజూరాబాద్ ఆర్డీవోలు ఆనంద్కుమార్, బెన్ షాలోం, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్ల సమస్యలు పరిష్కరించాలి
హౌసింగ్బోర్డు కాలనీ/కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 3: ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ శశాంక తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి శనివారం ఆయన తహసీల్దార్లు, ఆర్డీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ధరణి వెబ్సైట్లో పొందుపరిచిన అంశాలు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్లాల్, నాయబ్ తహసీల్దార్లు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి..
ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్కు రాష్ట్రపతి
కేరళలో ట్రాన్స్జెండర్ కు బెదిరింపులు.. నామినేషన్ విత్డ్రా