కాల్వశ్రీరాంపూర్: ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యమందించాలని పెద్దపల్లి కలెక్టర్ డాక్టర్ సంగీతాసత్యనారాయణ వైద్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఆమె కాల్వశ్రీరాంపూర్లోని ప్రభుత్వ దవాఖానను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె వైద్యం కోసం వచ్చిన వారితో మాట్లాడారు. సిబ్బంది హాజరుపట్టిక, 104 అందించిన వైద్యసేవల రికార్డులు, ఎక్స్రే గది, బెడ్స్, కేసీఆర్ కిట్ అందించిన రికార్డు, ల్యాబ్ను పరిశీలించారు. దవాఖాన పరిసరాలను కలియతిరిగి చుట్టూ చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. దవాఖానలో ఓపీ సేవల సమయాన్ని పెంచాలని డాక్టర్ ప్రవీణ్కు సూచించారు. అనంతరం కలెక్టర్ సిబ్బందితో మాట్లాడుతూ సమయపాలన పాటించి, దవాఖానకు వచ్చే రోగులకు అందుబాటులో ఉంటూ, మెరుగైన వైద్యమందించాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వంద శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చూడాలన్నారు. పెద్దరాత్పల్లి, వెన్నంపల్లి గ్రామాల్లో మంజూరైన సబ్ సెంటర్ల నిర్మాణంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని, స్థలం చూసిన తర్వాత కూడా పనులు ప్రారంభించకపోతే ఎలా అంటూ డాక్టర్ ప్రవీణ్ను ప్రశ్నించారు. వెంటనే నిర్మాణ పనులు చేపట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
కొవిడ్ నిబంధనలు పాటించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు జరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బోధించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. మంగపేట హైస్కూల్ ను కలెక్టర్ సంగీతా సత్యనారాయణ పరిశీలించారు. పాఠశాల ఆవరణలోని టాయిలెట్స్ సరిగా ఉన్నాయా అంటూ ఆరా తీశారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఉపాధ్యాయ సిబ్బందిని ఆదేశించారు. ప్రతి విద్యార్థి మాస్కు ధరించేలా చూడాలన్నారు. ప్రతి పాఠశాల తరగతి గది, పరిసరాలను ప్రతిరోజూ శుభ్రం చేయించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో పిల్లలకు జ్వరం ,జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే సమీపంలోని దవాఖానలో పరీక్షలు చేయించాలన్నారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి
తహసీల్దార్ కార్యాలయంలో జరిగే రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని తహసీల్దార్ సునీతను కలెక్టర్ సంగీతాసత్యనారాయణ ఆదేశించారు. ధరణి, పెండింగ్ సర్టిఫికెట్ తదితర అంశాలపై సిబ్బందితో తహసీల్దార్ కార్యాలయంలో సమీక్షా సమవేశం నిర్వహించారు. పెండింగ్ రిజిస్ట్రేషన్ సమస్యలు త్వరగా పరిష్కరించాలన్నారు. అనంతరం వ్యవసాయాధికారులతో రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వ్యవసాయ శాఖ ద్వారా జరుగుతున్న పంటల వివరాల నమోదు ప్రక్రియ, బీమా నమోదు, తదితర అంశాలపై చర్చించారు. రైతులు యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు పండించేలా వారిని ప్రోత్సహించాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ నూనేటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, డీఏవో తిరుమల్ప్రసాద్, తహసీల్దార్ సునీత, ఎంపీడీవో రామ్మోహన్, డాక్టర్ మహేందర్, హెచ్ఈవో సుధాకర్, ఏవో నాగగార్జున, సర్పంచ్ బుర మంగ సదానందం, ఏఈవోలు, వైద్య సిబ్బంది ఉన్నారు.