పెద్దపల్లి : పెద్దపల్లి నియోజకవర్గంలో నిరంతరం అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలు చేపడుతూ..నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం పెద్దపల్లి మండలంలోని బొంపల్లి- రాగినేడు మీదుగా కుర్మపల్లి వరకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద రూ. 2.48కోట్లతో తారు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గ్రామాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేవన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లోని ప్రజల మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను పూర్తి చేశామన్నారు.
రాబోయే రోజుల్లో ప్రజల ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ప్రత్యేక ప్రణాళికలతో అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జెడ్పిటిసి బండారి రామ్మూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ శంకర్ నాయక్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు అనంత రెడ్డిలతోపాటు పలువురు పాల్గొన్నారు.