పెద్దపల్లి, నవంబర్ 30(నమస్తే తెలంగాణ): రామగుండం కార్పొరేషన్లో లంచం కోసం అధికారులు వేధిస్తున్నారు. ఏ ఫైలు కదలాలన్నా రూ.లక్షల లంచాలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయిస్తున్నారు. గత సెప్టెంబర్ 9న పెద్దపల్లి జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి(సీపీఓ) వెంకటనారాయణ రూ.40వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కగా, తాజాగా రూ.లక్ష లంచం తీసుకుంటూ ఇన్చార్జి కమిషర్గా విధులు నిర్వహిస్తున్న పెద్దపల్లి ఆర్డీవో శంకర్కుమార్ పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కొవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో రామగుండం కార్పొరేషన్ పరిధిలో కాంట్రాక్టర్ గైక్వాడ్ రజనీకాంత్ సానిటేషన్ పనులు చేపట్టారు. వీటిపై కార్పొరేషన్ నుంచి రజనీకాంత్కు రెండు బిల్లులుగా రూ.9,28, 796లు చెల్లించాల్సి ఉంది. నాలుగు నెలల క్రితం రామగుండం కమిషనర్ కలెక్టర్గా బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో పెద్దపల్లి ఆర్డీవో శంకర్కుమార్కు ఇన్చార్జ్ బాధ్యతలను అప్పగించారు. బిల్లు చెల్లింపు కోసం కాంట్రాక్టర్ పలుమార్లు ఇన్చార్జ్ కమిషనర్ను కలిశాడు. అయితే లంచం ఇవ్వనిదే బిల్లులు చేయించనని మొండి కేయడంతో ఎంత కావాలని అడిగాడు.
రూ.లక్ష ఇస్తేనే బిల్లులు చేయిస్తానని చెప్పడంతో గైక్వాడ్ రజనీకాంత్ ఏసీబీని ఆశ్రయించారు. పక్కా ప్రణాళికతో మంగళవారం పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయాన్ని ఆనుకొని ఉన్న క్యాంపు కార్యాలయ నివాసంలో డబ్బులు చెల్లించేందుకు గైక్వాడ్ రజనీకాంత్ వచ్చాడు. దీంతో ఆర్డీవో తన ఇంట్లో పనిచేసే హన్మకొండకు చెందిన తోట మల్లికార్జున్కు ఇవ్వాలని చెప్పడంతో అతనికి రూ.లక్ష ఇచ్చాడు. తర్వాత రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వలపన్ని డబ్బులను రికవరీ చేసుకొని ఆర్డీవో నుంచి రూ.లక్ష స్వాధీనం చేసుకొని కెమికల్ టెస్ట్ నిర్వహించారు. టెస్ట్లో పాజిటివ్ అని తేలడంతో ఆయనను అదుపులోకి తీసుకొని పంచనామా నిర్వహించారు. బుధవారం కరీంనగర్లోని ఏసీబీ స్పెషల్ కోర్టులో ఆర్డీవో, ఇన్చార్జి కమిషనర్ శంకర్కుమార్ను, ఆయన సహాయకుడు తోట మల్లికార్జున్ను హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. ఈ దాడుల్లో కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల సీఐలు రాము, సంజీవ్, రవీందర్, సునీల్కుమార్,జానీరెడ్డి ఉన్నారు.
నేడు ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తాం
కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పెద్దపల్లి ఆర్డీవో, రామగుండం కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ శంకర్ కుమార్ను బుధవారం కరీంనగర్లోని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పరుస్తాం. పూర్తిస్థాయి పంచనామా రిపోర్టులను సిద్ధం చేశాం. సాక్ష్యాధారాలను, ప్రత్యక్ష సాక్షులను ప్రవేశపెడుతాం. ఆర్డీవో శంకర్కుమార్ సహాయకుడు తోట మల్లికార్జున్ను సైతం కోర్టులో హాజరు పరుస్తాం.