కాల్వశ్రీరాంపూర్: హరిత తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో విస్తృతంగా మొక్కలు నాటుతున్నట్లు ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు ‘ఊరి ఊరికో జమ్మిచెట్టు-గుడి గుడికో జమ్మి చెట్టు’ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని జగత్మహామునీశ్వరాలయంలో ఆదివారం ఎమ్మెల్యే జమ్మి మొక్కను నాటారు.
ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు అర్చకులు పూర్ణకుంభంతోపాటు జమ్మి మొక్కలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేద కాలం నుంచి జమ్మి చెట్టును పూజించడం అనవాయితీగా వస్తున్నదన్నారు. తెలంగాణలో దసరా పండుగ సందర్భంగా జమ్మిచెట్టుకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ జమ్మి చెట్టును రాష్ట్ర వృక్షంగా ప్రకటించారని గుర్తు చేశారు. హరితహారంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో పండ్ల, పూల మొక్కలు నాటాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, ఆలయ నిర్వాహకులు బసవత్తుల రాజమౌళీశ్వరస్వామి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ నిదానపురం దేవయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.