ఎలిగేడు : మండలంలోని ధూళికట్ట, ముప్పిరితోట గ్రామాల్లోని నర్సరీలు, పల్లె ప్రకృతివనాలు , జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పెద్దపల్లి అదనపు కలెక్టర్ దీపక్ కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులు, సర్పంచ్లకు సూచించారు. గ్రామంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని అర్జీ పెట్టుకున్నా ఇంతవరకు తహసీల్దార్ స్థలం చూపలేదని సర్పంచ్ కావేరి అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన స్థలం కొలతలు చేసి హద్దులు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీకి అప్పగించాలని తహసీల్దార్ను ఆదేశించారు.
అనంతరం ముప్పిరితోటలో పంచాయతీ రికార్డులు , ఉపాధిహామీ పథకం కింద నిర్వహిస్తున్న రికార్డులను అదనపు కలెక్టర్ పరిశీలించారు. అందరికీ కొవిడ్ టీకా వేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు గొల్లె కావేరి, పెద్దోల్ల అయిలయ్య, ఎంపీడీవో శ్రీనివాసమూర్తి, మాజీ ఎంపీటీసీ గొల్లె భూమేశ్ తదితరులున్నారు.