యైటింక్లయిన్ కాలనీ : సింగరేణి సంస్థ ఆర్జీ-2 ఏరియాలోని వకీలుపల్లి భూగర్భ గని విస్తరణకోసం చేపట్టిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా జరిగింది. శుక్రవారం సింగరేణి కమ్యూనిటీ హాలులో జిల్లా అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ కాలుష్య నియంత్రణ మండలి అధికారి రవిదాస్తోపాటు ప్రభావిత ప్రాంతాల ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించడంతోపాటు వినతి పత్రాలను అందజేశారు.
1975లో 205.34 హెక్టార్ల భూమిలో వకీలుపల్లి గని ప్రారంభమైంది. ఇందులో 48.7 హెక్టార్లు అటవీ భూమి, 156.56 హెక్టార్లు ప్రభావిత గ్రామాల నుంచి సేకరించారు. గని రివైజ్డ్ ప్లాన్ కేంద్ర బొగ్గుమంత్రిత్వశాఖ నుంచి ఆమోదించబడిన బొగ్గు గని ప్లానింగ్లో 2020 వరకు మాత్రమే 0.45మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసుకునేందుకు అనుమతి ఉంది. దీంతో గని విస్తరణకు తప్పని పరిస్థితుల్లో పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. పర్యావరణ అనుమతులు వచ్చినచో వకీలుపల్లి గని జీవిత కాలం మరో ఏడేండ్లు పెరిగే అవకాశం ఉంది.
దీనిని దృష్టిలో పెట్టుకుని గని విస్తరణకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర పర్యావరణశాఖకు దరఖాస్తు చేసుకుంది. దీంతో జిల్లా అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు హాజరైన ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ కార్మిక సంఘాల నుంచి అదనపు కలెక్టర్ అభిప్రాయాలను సేకరించి గని అనుమతుల కోసం ఉన్నతాధికారులకు నివేదికను ఇవ్వనున్నట్లు తెలిపారు. యాజమాన్యం బొగ్గు ఉత్పత్తితోపాటు ప్రభావిత గ్రామాల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించాల్సిన అవసరముందని సూచించారు. ప్రధానంగా గని విస్తరణ సమయంలో పర్యావరణానికి హాని తలపెట్టకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
బొగ్గు ఉత్పత్తి సమయంలో దుమ్ము, ధూళి వెలువడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, పెద్దపల్లి డీసీపీ రవీందర్, శ్రీనివాస్రావు, సందనాల సాంబయ్య, పర్యావరణ అధికారి ఎం.రాజారెడ్డి, ఏజెంట్ కాంరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మోహన్ రెడ్డి, అధికార ప్రతినిధి గుండా ప్రదీప్ కుమార్, టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సభ్యులు కెంగర్ల మల్లయ్య, డివిజన్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు దేవ వెంకటేశం, బదావత్ శంకర్నాయక్, కొత్త సత్యనారాయణరెడ్డి, చెరుకు ప్రభాకర్ రెడ్డి, ఐ.సత్యం, బేతి చంద్రయ్య పాల్గొన్నారు.
పర్యావరణ అనుమతులతో గని జీవిత కాలం పెరుగుతుంది : -ఆర్జీ-2 జీఎం వెంకటేశ్వరరావు
వకీలుపల్లి భూగర్భ గని విస్తరణకు యాజమాన్యం చర్యలు తీసుకున్నది. పర్యావరణ అనుమతులు లభించడంతో వార్షిక బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం 0.35 మిలియన్ టన్నులు సాధించడంతోపాటు ప్రధానంగా 3 వందల మీటర్ల లోతులో 3వ, 4వ బొగ్గు పొరల్లో మిగులు 2.36 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను వెలికితీసేందుకు బోర్డు అండ్ ఫిల్లర్, కంటిన్యూస్ మైనర్ సాంకేతికతను వినియోగించనున్నాము. తద్వారా గని జీవిత కాలం మరో 7 నుంచి 8 ఏండ్లు పెరుగనున్నది.
ప్రభావిత గ్రామాలకు అండగా ఉంటాం : టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు
సింగరేణి విస్తరణకు తమ భూములు, స్థలాలు ఇచ్చిన ప్రభావిత గ్రామాల ప్రజలకు సింగరేణి గుర్తింపు సంఘంగా టీబీజీకేఎస్ అండగా ఉంటుందని వెంకట్రావు చెప్పారు. గని విస్తరణకు అనుమతులు కావాల్సిన అవసరముందన్నారు. ప్రభావిత గ్రామాల ప్రజలు సమస్యలను మా దృష్టికి తీసుకొస్తే సీఎం దగ్గరకు తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.
ప్రభావిత గ్రామాల్లో వసతులు కల్పించాలి : నరేశ్రావు, దుబ్బపల్లి సర్పంచ్
సింగరేణి ప్రభావిత గ్రామాల్లో యాజమాన్యం మౌలిక వసతులు కల్పించాలి. ప్రభావిత గ్రామాల అభివృద్ధికి యాజమాన్యం కేటాయించిన సీఎస్ఆర్ నిధులను గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాలి. ప్రభావిత గ్రామాల ప్రజల సంపూర్ణ ఆరోగ్యానికి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడంతోపాటు స్థానిక డిస్పెన్సరీలో వైద్యం అందించాలి.