ఫర్టిలైజర్సిటీ, మే 30 : రామగుండం సీపీ ఆదేశాల మేరకు గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ ఆధ్వర్యంలో వన్టౌన్ సీఐలు రమేశ్బాబు, రాజ్కుమార్, ఎస్ఐలు ప్రవీణ్కుమార్, ఉమాసాగర్, సతీశ్ లాక్డౌన్ను మరింత పటిష్టం చేస్తున్నారు. లాక్డౌన్ మినహాయింపు సమయంలో గాకుండా ఉదయం 10 గంటల తర్వాత బయట తిరిగే ఆకతాయిలను నేరుగా ఐసొలేషన్కు పంపిస్తున్నారు. ఆదివారం గోదావరిఖనిలో పోలీసులు గల్లీ గల్లీల్లో పెట్రోలింగ్ చేస్తుండగా, కారణాలు లేకుండా బయట తిరుగుతున్న 20 మంది యువకులను అదుపులోకి తీసుకొని ముందుగా ప్రభుత్వ దవాఖానకు తరలించి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయించారు. అనంతరం వారిని స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈమేరకు ఆదివారం 20 బైకులను సీజ్ చేసినట్లు సీఐ రమేశ్బాబు తెలిపారు. 10 తర్వాత బయట తిరిగే వ్యక్తులను నేరుగా ఐసొలేషన్కు తరలిస్తామని వారు హెచ్చరించారు.
ఆకతాయిలపై కఠినంగా వ్యవహరిస్తాం..
సుల్తానాబాద్, మే 30 : రామగుండం సీపీ ఆదేశాల మేరకు ఆకతాయిలపై కఠినంగా వ్యవహరిస్తామని సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి స్పష్టం చేశారు. సుల్తానాబాద్లో ఆదివారం అనవసరంగా బయటికి వచ్చి తిరుగుతున్న 14 మందిని పట్టుకొని వ్యాన్లో సుల్తానాబాద్, బెల్లంపల్లి ఐసొలేషన్ సెంటర్లకు తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, ఆకతాయిలు సరదా కోసం బయటికి వస్తూ కరోనా ఉధృతికి కారణమవుతున్నారని వివరించారు. ఐసొలేషన్ కేంద్రాలకు తరలించిన వారికి పరీక్షలు చేయిస్తామని, పాజిటివ్ వస్తే 14రోజులు ఇక్కడే ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆయన వెంట ఎస్ఐలు ఉపేందర్రావు, లింగారెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
మంథని రూరల్ మే 30: మంథని మండలంలోని పలు గ్రామాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ నమోదవుతున్న సందర్భంగా పల్లెల్లో పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేయాలని ఎస్ఐ చంద్ర కుమార్ సూచించారు. ఆదివారం పుట్టపాకలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ ఉన్నాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాగ్రత్తలపై మైక్ ద్వారా అవగాహన కల్పించారు. గ్రామంలో సుమారు 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇందులో ఇద్ద రు మృతి చెందారని పేర్కొన్నారు. అనంతరం కరోనా బాధితుల ఇండ్ల దగ్గరికి వెళ్లి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రొడ్డ మమత శ్రీనివాస్, ఎంపీటీసీ శ్రీనివాస్, ఏఎన్ఎం జ్యోతి, ఆశ వర్కర్ స్వరూప పాల్గొన్నారు.