28 వరకు డిగ్రీ ప్రవేశాల పక్రియ
ప్రభుత్వ కళాశాలల ఆధ్వర్యంలో సహాయక కేంద్రాలు
పెద్దపల్లి, జూలై 25 (నమస్తే తెలంగాణ): డిగ్రీ ప్రవేశాల గడువును పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 24తో ప్రవేశాల గడువు ముగిసిపోగా 28వరకు పొడిగించారు. ఈమేరకు దోస్త్ కన్వీనర్ లింబాద్రి శనివారం ప్రకటించారు. దీంతో దరఖాస్తు చేసుకోని వారికి మరో అవకాశం లభించింది.
ప్రభుత్వం ఆన్లైన్ విధానం అమల్లోకి తేవడంతో ఏ విశ్వ విద్యాలయం పరిధిలోనైనా చేరేందుకు ఇంటి నుంచే దరఖాస్తు చేసుకునే అవకాశం లభించింది. ప్రవేశాలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇందు కోసం విద్యార్థులు ముందుగానే తమ ఆధార్కు ఫోన్ నంబర్ లింక్ చేసుకుంటే సరిపోతుంది. టీ-యాప్లో లాగిన్ కాగానే వారికి దోస్త్ ఐడీ, పిన్ నంబర్ వస్తుంది. దానిని ఉపయోగించి దరఖాస్తు పూర్తి చేసుకోవాలి. అందులో కోర్సులు, కళాశాలల వారీగా ప్రాధాన్యతా క్రమంలో వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. కోరుకున్న కళాశాలలో సీటు వస్తే సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఏ దశ కౌన్సెలింగ్లో అయినా సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా ఎంపిక చేసుకున్న కళాశాలకు వెళ్లి ధ్రువ పత్రాలు సమర్పించి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
నమోదులో జాగ్రత్త..
దోస్త్ వెబ్సైట్లో తమ పేరును నమోదు చేసుకునే సమయంలో అభ్యర్థులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముందుగా దోస్త్ సైట్లోకి వెళ్తే అందులో తెలుగు, ఇంగ్లీషు నియమనిబంధనలు ఉంటాయి. వాటిని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదువుకుంటే ఎంట్రీ సులువుగా చేసుకోవచ్చు. అంతేకాదు, తప్పులు లేకుండా నమోదు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఏమైనా ఇబ్బందులు ఎదురైనా, తప్పుడు వివరాలు నమోదు చేసినా సెల్ నంబర్కు మెసేజ్ వస్తుంది. సదరు మెసేజ్తో సేవా కేంద్రాల్లో సంప్రదిస్తే వారు పరిశీలించి తగిన మార్పులు చేర్పులు చేస్తారు. అయితే వివరాలు నమోదు చేసే ముందే అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తే, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రావని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు.
సేవా కేంద్రం ద్వారా ఉచిత సేవలు
జిల్లాల్లో ఏర్పాటు చేసిన సేవా కేంద్రాల్లో విద్యార్థులు ఆధార్తో పాటు ఫారం కోసం రూ.200 చెల్లిస్తే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లో ఉన్న అధ్యాపకులు రిజిస్ట్రేషన్తోపాటు వెబ్ ఆప్షన్లు కూడా పెడతారు. ఈ క్రమంలో విద్యార్థులకు నచ్చిన కళాశాల ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా విద్యార్థులు తామే రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రమంలో ఏవైనా తప్పులు జరిగినా ఈ కేంద్రాల ద్వారా సరిదిద్దుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ కళాశాలల ఆధ్వర్యంలోనే సహాయక కేంద్రాలను నిర్వహిస్తున్నారు.
పెంచిన గడువును సద్వినియోగం చేసుకోవాలి
ఇంటర్ పూర్తి చేసి దోస్త్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకోని విద్యార్థులు పెంచిన గడువును సద్వినియోగం చేసుకొని నచ్చిన కోర్సుల్లో చేరాలి. దీనిని ప్రతీ ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలి. ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కాలేజీల్లో కూడా నాణ్యమైన విద్య అందిస్తున్నాం. రిజిస్ట్రేషన్ సమయంలో సందేహాలుంటే హెల్ప్లైన్ లేదా కళాశాలలో అడిగి తెలుసుకొని నివృత్తి చేసుకోవాలి.
-ఖాజా జహీర్అహ్మద్, ప్రిన్సిపాల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గోదావరిఖని