ఒక్కరోజే లక్షలాది మొక్కలు నాటేందుకు రెడీ
పెద్దపల్లి నియోజకవర్గంలో 2 లక్షలు..
రామగుండం నియోజకవర్గంలో 5లక్షలు..
ఏర్పాట్లలో ఎమ్మెల్యేలు దాసరి, కోరుకంటి
ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలి : మండలి విప్ భానుప్రసాద్రావు
పెద్దపల్లి జంక్షన్/ యైటింక్లయిన్ కాలనీ, జూలై 23 (నమస్తే తెలంగాణ) :ఏటా తన పుట్టిన రోజు సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న మంత్రి కేటీఆర్కు అభిమానులు ఈ సారి బర్త్డే సందర్భంగా హరిత కానుక ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు శనివారం జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో 2లక్షల పండ్ల మొక్కలు నాటుతామని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 5లక్షల మొక్కలు నాటుతామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. ఇందుకు ఆయాచోట్ల ఏర్పాట్లు పూర్తిచేశారు.
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా శనివారం జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమాత్యుడు ఇచ్చిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ పిలుపులో భాగంగా ప్రతి చోటా సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. పేదలకు సాయం అందించడంతోపాటు పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు అంతా సిద్ధం చేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలో 2లక్షల పండ్ల మొక్కలు నాటేందుకు ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అంతా సిద్ధం చేశారు. ముక్కోటి వృక్షార్చనలో భాగంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఒకేరోజు 5లక్షల మొక్కలు నాటేందుకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్ని ఏర్పాట్లు చేశారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, కార్పొరేషన్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతండగా, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్, మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
ఊరూరికీ పండ్ల మొక్కలు: ఎమ్మెల్యే దాసరి
మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గంలో 2 లక్షల పండ్ల మొక్కలు నాటుతామని, ఊరూరికీ పండ్ల మొక్కలు అందిస్తామని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి తెలిపారు. పెద్దపల్లి పట్టణంలోని ట్రినిటి ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో సిద్ధంగా ఉంచిన పండ్ల మొక్కలను శుక్రవారం గ్రామాలకు తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. శనివారం పండుగ వాతవరణంలో నియోజకవర్గంలో మొక్కలు నాటుతామని చెప్పారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని, ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని కోరారు. ఇక్కడ ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ నజ్మీన్ సుల్తానా మొబిన్, సర్పంచులు ఎద్దు కుమారస్వామి, పోచాలు, కమిషనర్ తిరుపతి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.