లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ ( TAUK ) ఆధ్వర్యంలో లండన్లో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. బోనాల జాతరలో భాగంగా లండన్ వీధుల్లో తొట్టెలను ఊరేగించారు. స్థానిక గుడిలో అమ్మవారికి బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా నిర్వహించామని టాక్ అధ్యక్షులు రత్నాకర్ కడుదుల తెలిపారు.
ఈ సందర్భంగా టాక్ ఉపాధ్యక్షురాలు శుష్మణ రెడ్డి మాట్లాడుతూ.. అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకున్నామని తెలిపారు. కరోనా నుంచి ప్రజలను రక్షించాలని ప్రార్థించామన్నారు. ప్రతి ఒక్కరే స్వీయ క్రమశిక్షణ పాటించి, కరోనాను అంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని బోనాలు సమర్పించిన ప్రతి ఆడబిడ్డకు టాక్ తరపున శుష్మణ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
సురేష్ బుడుగం, స్వాతి దంపతులు వారి ఇంట్లో సంప్రదాయబద్దంగా అమ్మ వారి పూజ నిర్వహించారు. టాక్ తరపున ఆ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. చిన్న పిల్లలు టాక్ జెండాలతో, అమ్మవారి నినాదాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
టాక్ సంస్థ ఆవిర్భావం నుంచి ప్రత్యేక శ్రద్ధతో సంస్థను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్లకు టాక్ నాయకుడు నవీన్ రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి, నవీన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, స్వాతి, సుప్రజ, సురేష్ బుడగం, రాకేష్ పటేల్, సత్యపాల్ ,హరిగౌడ్, గణేష్, రవి రెటినేని, రవి పులుసు, మాధవ్ రెడ్డి, వంశీ వందన్, భూషణ్, అవినాష్, వంశీ కృష్ణ , పృథ్వి, శ్రీ లక్ష్మి, విజిత, క్రాంతి, భరత్, వంశీ పొన్నం, చింటూ, రమ్య, స్వప్న, లాస్య, పూజిత, బిందు, మాధవి తదితరులు పాల్గొన్నారు.