హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య 40కి చేరుకోనున్నది. తెలంగాణవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు టెర్షియరీ కేర్ సేవలు చేరువ చేయాలనే లక్ష్యంతో కొత్తగా 7 మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేయనున్నట్టు గత నెలలో జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. సంగారెడ్డి, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్, నాగర్కర్నూల్లలో కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేయనున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన డీపీఆర్ను సిద్ధంచేసి ప్రభుత్వానికి అందించగా, కాలేజీలు ఏర్పాటుచేయబోయే స్థలాలను అధికారులు పరిశీలించారు. రెండేండ్లలోనే ఈ బోధనా దవాఖానల్లో సేవలు ప్రారంభమయ్యే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
కొత్తగా ఏర్పాటుచేయబోతున్న ఒక్కో మెడికల్ కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్లు రానున్నాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ విభాగం తమ ప్రతిపాదనల్లో ఇదే అంశాన్ని చేర్చింది. దీంతో 7 కాలేజీల్లో కలిపి మొత్తం 1,050 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వర్యంలో 9 మెడికల్ కాలేజీలు ఉండగా, వీటిలో 1,615 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో మరో 100 సీట్లు ఉండగా, బీబీనగర్ ఎయిమ్స్లో మరో 50 సీట్లు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే 1,765 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కొత్తగా వచ్చే 1,050 సీట్లు కలుపుకుంటే మొత్తం 2,815 ఎంబీబీఎస్ సీట్లు అవుతాయి. ఇవి కాకుండా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 23 ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 3,350 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే రాష్ట్రంలో 6,165 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. వీటితోపాటు అదనంగా నర్సింగ్ కాలేజీలను ఏర్పాటుచేయనున్నారు. ప్రస్తుతం జగిత్యాలలో మాత్రమే ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ఉండగా, ఇక్కడ 50 సీట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన అన్ని చోట్లా కొత్తగా ఏర్పాటుచేయాల్సి ఉన్నది. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఏర్పాటయ్యే నర్సింగ్ కాలేజీకి 100 సీట్ల చొప్పున మొత్తం 1,250 అందుబాటులోకి రానున్నాయి. సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, వనపర్తి, కొత్తగూడెం, జగిత్యాల, నాగర్కర్నూల్, సూర్యాపేట, నల్లగొండ, మహబూబ్నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిద్దిపేటలో నర్సింగ్ కాలేజీలు ఏర్పాటవుతాయి.