లండన్: ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేగింది. శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిసిన అనంతరం సోమవారం నిర్వహించిన పరీక్షల్లో ముగ్గురు ఆటగాళ్లు, నలుగురు సహాయక సిబ్బంది కొవిడ్-19 బారిన పడ్డట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ).. వైరస్ బారిన పడిన ఆటగాళ్ల పేర్లు బయట పెట్టకుండా మొత్తం జట్టును పది రోజుల పాటు ఐసోలేషన్లో ఉంచింది. కరోనా కేసులు వెలుగు చూడటంతో గురువారం నుంచి పాకిస్థాన్తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్పై అనుమానాలు వ్యక్తమయ్యేలోపే.. స్టార్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ సారథ్యంలో బోర్డు 18 మందితో మరో జట్టును ఎంపిక చేయడంతో పాటు కార్డిఫ్లోనే తొలి వన్డే జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ జట్టులో తొమ్మిది మంది తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికవడం గమనార్హం.
ఇంగ్లండ్ జట్టులో కరోనా కేసులు నమోదైనా.. అక్కడే పర్యటిస్తున్న టీమ్ఇండియా బ్రేక్ కొనసాగుతుందని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఇంగ్లండ్ వెళ్లిన కోహ్లీ సేన.. ఆతిథ్య జట్టుతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు మధ్య విరామం లభించడంతో 20 రోజుల బ్రేక్ తీసుకుంది. భారత ఆటగాళ్లు ప్రస్తుతం తమ కుటుంబ సభ్యులతో కలిసి రిలాక్స్ అవుతున్నారు. వచ్చే నెల 4 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుండగా.. భారత ఆటగాళ్లు ఈ నెల 14న లండన్లో తిరిగి ఒకచోటకు చేరనున్నారు. అక్కడ కొవిడ్ పరీక్షల అనంతరం బయోబబుల్లో ప్రవేశించి డర్హంలో ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడనున్నారు.