సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 28: గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీల్లో పారిశుధ్య నిర్వహణ నిరంతర ప్రక్రియగా కొనసాగాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సంగారెడ్డి, నారాయణఖేడ్ నియోజకవర్గాల డీఎల్పీవోలు, ఎంపీడీవోలు, మండల ప్రత్యేకాధికారులు, ఎం పీవోలు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, అట వీ, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారంపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జూలై 1 నుంచి ప్రారంభం కానున్న నాల్గో విడుత పల్లె ప్రగతి కార్యక్రమ నిర్వహణకు షెడ్యూల్ మేరకు కార్యాచరణ ప్రణాళికతో సిద్ధం కావాలని సంబంధిత అధికారులకు సూచించారు. జూలై 1నుంచి 10వ తేదీ వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసిందని, ప్రతి గ్రామానికి ఒక పంచాయతీ కార్యదర్శిని నియమించిందన్నారు. పంచాయతీ కార్యదర్శు లు నిబద్ధతతో బాధ్యతగా పని చేయాలని స్పష్టం చేశారు. ఎంపీడీవోలు, ఎంపీవోలు, ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షించాలని సూచించారు.
సెగ్రిగేషన్ షెడ్లన్ని వినియోగంలోకి తీసుకురావాలి
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో, మున్సిపాల్టీల్లో సెగ్రిగేషన్ షెడ్లన్నింటినీ వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ప్రతి రోజూ తడి, పొడి చెత్త విడిగా తరలించి కంపోస్ట్ ఎరువు తయారు చేసి నర్సరీలో, పల్లె ప్రకృతి వనాల్లో, అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలకు కంపోస్ట్ ఎరువులను నాటాలన్నారు. అయితే అది ఒక అలవాటుగా కొనసాగాలని కలెక్టర్ సూచించారు. గ్రామ సభలు నిర్వహించి ప్రగతి నివేదికను కార్యదర్శి చదివి వినిపించాలన్నారు. మున్సిపాల్టీల్లో వార్డుల వారీగా సభలు నిర్వహించి అభివృద్ధి నివేదికను సంబంధిత అధికారులు, వార్డు కౌన్సిలర్ చదివి వినిపించాలని స్పష్టం చేశారు. గ్రామ సభలలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, ఎక్స్ సర్వీస్మెన్లు పాల్గొనేలా చూడాలన్నారు. ఈ నెల 30లోగా పంచాయతీ వెబ్సైట్లో కార్యాచరణ ప్రణాళికను పొందుపర్చాలని ఆదేశించారు. అన్ని డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు వినియోగంలోకి తీసుకురావాలని, వాటికి బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రజా ఆరోగ్యంపై దృష్టి సారించాలి
వర్షాకాలం ప్రారంభం అయినందున ప్రజల ఆరోగ్యం దృష్ట్యా దోమల నివారణకు, మురుగునీరు తొలగింపు, నీటి గుంతలో ఆయిల్ బాల్స్ వేయడం, రసాయనాలు చల్లడం, ఫాగింగ్ చేయడం, మంచినీటి వనరులను తనిఖీ చేసి శుభ్రపరచి క్లోరినేషన్ చేయాలని సూచించారు. తాగునీటి పైప్లైన్ నల్లాలకు సంబంధించిన అన్ని లీకేజీల మరమ్మతులను చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామంలో నిరుపయోగంగా ఉన్న బావులను, ఉపయోగంలో లేని బోరుబావులను పూడ్చి వేయించాలని, అన్ని ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు, ముళ్లపొదలు తొలగించాలని సూచించారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో గ్రీన్ బడ్జెట్ను 100 శాతం వినియోగించి ఆయా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలను పచ్చదనంతో నింపాలని సంబంధిత అధికారులకు సూచించారు. జూలై 1 నుంచి 10 వరకు జరిగే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని, అన్ని కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేయాలని వివరించారు. బాగా పనిచేసే అధికారులను ప్రో త్సహించి అన్ని విధాల సహకరిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. కరోనా, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనధికారిక లే అవుట్లకు, అనుమతిలేని భవన నిర్మాణాలను ప్రోత్సహించరాదని స్పష్టం చేశా రు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజర్శి షా, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు, డీపీవో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.