స్వరాష్ట్రం సిద్ధించి కేసీఆర్ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు పురోగమన దిశలో నడుస్తున్నాయి. ఈ కళాశాలల పురోగమనంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు లెక్చరర్ల కృషి ప్రశంసనీయమైనది. రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల్లో దాదాపు 6,000 మంది కాంట్రాక్టు అధ్యాపకులున్నారు.
ఇరవై ఏండ్లుగా కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంట్రాక్టు అధ్యాపకులకు చాలీచాలని జీతాలుండేవి. అధ్యాపక సంఘాలు సమ్మె లు, ధర్నాలు చేసినా పట్టించుకోలేదు. ఈ తరుణంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ హమీ ఇచ్చారు. తొలియేడు (2014) కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ కోసం జీవో16ను జారీచేయగా విపక్షాల ద్వంద్వ వైఖరి వల్ల కోర్టులో అడ్డంకులు ఏర్పడ్డాయి. సమాన పనికి సమాన వేతనం అనే సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా కాంట్రాక్టు లెక్చరర్లకు 2017లో కేసీఆర్ ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగులతో సమానమైన వేతనం అమలుచేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఎన్నికలకు వెళ్లేముందు తన్నీరు హరీశ్రావు చొరవతో కాంట్రాక్టు లెక్చరర్లకు 12 నెలల వేతన సదుపాయం కల్పించింది.
కేసీఆర్ ప్రభుత్వం భావించిన విధంగా జీవో16 ప్రకారం కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ జరిగితే అనేక సమస్యలు పరిష్కారమయ్యేవి. ఈ జీవోకు వ్యతిరేకంగా కొందరు నిరుద్యోగులు కోర్టుకు వెళ్లడం, స్టే రావడంతో క్రమబద్ధీకరణ నిలిచిపోవడం జరిగింది. అప్పటినుంచి కేసీఆర్ జీవోకు ఉన్న అడ్డంకులు తొలగించడానికి ప్రయత్నిస్తున్నది. కాంట్రాక్టు అధ్యాపకుల సంక్షేమమే ధ్యేయంగా వ్యవహరిస్తున్నది. పీఆర్సీని రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వంటి ఉద్యోగులకు వర్తింపజేస్తామనే చరిత్రాత్మక నిర్ణయాన్ని 2021 మార్చి నెలలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ నిర్ణయం అమల్లో భాగంగా ఈ నెల 17వ తేదీన ఆర్థికమంత్రి హరీశ్రావు చొరవతో, విద్యాశాఖ కార్యదర్శి ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు కొత్త పీఆర్సీ ప్రకారం మూల వేతనానికి సంబంధించిన జీవో 104, 105, 106లను జారీ చేశా రు. దీంతో జూనియర్ కళాశాలల్లోని సుమారు 3600 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనం నెలకు రూ.37,100 నుంచి రూ.54,220; డిగ్రీ కాలేజీల్లోని సుమారు 850 మందికి రూ.40,270 నుంచి రూ.58,850; పాలిటెక్నిక్ కాలేజీల్లోని 450 మందికి రూ.40,270 నుంచి రూ.58,850కి పెరిగాయి.
వేతనాల పెరుగుదల వల్ల విద్యావ్యాప్తికి కాంట్రాక్టు అధ్యాపకులు మరింత శ్రద్ధతో కృషి చేయగలుగుతున్నారు. ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాల ద్వారా సబ్బండ వర్ణాలకు న్యాయం చేస్తున్న కేసీఆర్ కాంట్రాక్టు లెక్చరర్లకు కూడా న్యాయం చేస్తున్నారని తెలంగాణ సమాజం సం తోషిస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం లెక్చరర్లకు సంబంధించిన ఆర్థికభారం లేని సమస్యలను పరిష్కరించాలని అర్థిస్తున్నారు. ముఖ్యంగా బదిలీలను వీలైనంత త్వరగా చేపట్టాలని, మహిళా అధ్యాపకులకు ప్రసూతి సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు.
డాక్టర్ తిరుపతి పోతరవేని