ప్రొసీడింగ్ పత్రం అందజేత

ధర్మారం, జనవరి 24 : రామయ్యపల్లి గ్రామంలో అసంపూర్తిగా నిలిచిన యాదవ సంఘ భవన నిర్మాణానికి మంజూరైన రూ.4.60లక్షల నిధుల ప్రొసీడింగ్ ప్రతిని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆ గ్రామ కుల సంఘ నాయకులకు ఆదివారం అందజేశారు. కరీంనగర్లోని క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. మంత్రి ఈశ్వర్ నిధులు కేటాయించడంపై నాయకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, టీఆర్ఎస్ బీసీ సెల్ మండలాధ్యక్షుడు మూల మల్లేశం, యాదవ సంఘం అధ్యక్షుడు కొమ్మ మహేశ్ యాదవ్తోపాటు తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక సాయం
జూలపల్లి, జనవరి 24: కుమ్మరికుంట గ్రామానికి చెందిన నిరుపేద యువతి వివాహానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ‘ఎల్ఎం’ ట్రస్ట్ తరఫున ఆర్థికసాయం చేయడానికి ముందుకొచ్చారు. ఆదివారం కొప్పుల దీపికకు రూ.10వేల నగదు పంపించారు. అలాగే నల్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతికి రూ.5వేల నగదును నల్ల మనోహర్రెడ్డి అందజేసి ఆశీర్వదించారు. ఇక్కడ నాయకులు పాటకుల అనిల్, కొప్పుల అజిత్ పాల్గొన్నారు.