హైదరాబాద్, రంగారెడ్డి డీఎంహెచ్వోలు డాక్టర్ వెంకటి,డాక్టర్ స్వరాజ్యలక్ష్మి
సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : ఓ వైపు కరోనా తగ్గుముఖం పడుతున్నా.. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా లక్షణాలు, సీజనల్ వ్యాధుల లక్షణాలు ఒకేలా ఉండడంతో ప్రజల్లో అవగాహన పెంచడంతోపాటు వ్యాధులు విస్తరించకుండా చర్యలు తీసుకోబోతున్నారు. ప్రస్తుతం కరోనా నిర్ధారణ పరీక్షలు, టీకాలు వేసే ప్రక్రియలో నిమగ్నమైన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సీజనల్ వ్యాధుల వ్యాప్తిని నివారించేందుకు జీహెచ్ఎంసీ, జలమండలితో కలిసి సంయుక్త కార్యాచరణ రూపొందించింది. అవసరమైన చికిత్స అందించడం, వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకునేందుకు వైద్య,ఆరోగ్యశాఖ, దోమలు వృద్ధి చెందకుండా, ఫాగింగ్, యాంటీ లార్వా, డ్రైడే వంటి చర్యలు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ, తాగునీరు కలుషితం కాకుండా చూసేందుకు జలమండలి చర్యలు ముమ్మరం చేసింది. సాధారణంగా వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం, వైరల్ ఫీవర్తోపాటు డెంగీ, మలేరియా, డయేరియా వంటివి ప్రబలడం సహజం. వీటిని ప్రతి సంవత్సరం ఆరోగ్యశాఖ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది.
ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టినా వైరస్ పూర్తిగా ప్రజల నుంచి వీడిపోలేదు. మహమ్మారికి తోడు సీజనల్ వ్యాధులు తోడవనుండడంతో కొవిడ్ వైరస్, ఇటు సీజనల్ వ్యాధులు ఓవర్ల్యాప్స్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. సాధారణంగా వర్షాకాలంలో దోమల కారణంగా డెంగీ జ్వరాలు అధికంగా వస్తాయి. రోగులకు వచ్చిన జ్వరం కరోనాదా లేదా సీజనల్తో వచ్చిందా తెలుసుకోవడం అంత సులువుకాదంటున్నారు వైద్యులు. జ్వరమొచ్చిన ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు చేయడం సాధ్యం కాదని, అదే సమయంలో కేసును తేలికగా తీసుకోలేమంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సీజనల్ పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులిచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
గ్రేటర్ పరిధిలో 220 బస్తీ దవాఖానలు, 177 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మూడు జిల్లా దవాఖానల్లో సీజనల్ వ్యాధులకు సంబంధించి చికిత్స, నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వైద్యాధికారులు తెలిపారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 133 బస్తీ దవాఖానలు, 85 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 14 ఏరియా దవాఖానల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అవుట్ పేషెంట్ (ఓపీ) సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 35 బస్తీ దవాఖానలు, 53 ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా దవాఖానలో సీజనల్కు సంబంధించి అన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో 52 బస్తీ దవాఖానలు, 39 పీహెచ్సీలు, జిల్లా దవాఖానలో వ్యాధుల నివారణకు చర్యలు తీసుకున్నట్లు అక్కడి వైద్యాధికారులు పేర్కొన్నారు.
కరోనా నిర్ధారణ పరీక్షలు, టీకాతోపాటు రోగులకు కరోనా కిట్లు పంపిణీ చేస్తున్నాం. ఇప్పుడు కరోనాతోపాటు సీజనల్ వ్యాధులు ప్రబలితే విధి నిర్వహణ కత్తిమీద సామువంటిదే. కరోనా తొలిదశలో సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ఇప్పుడు కూడా మెరుగైన సేవలు అందిస్తాం. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు, ఐవీ ఫ్ల్యూయిడ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాం. అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. కరోనా సమయం కావడంతో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. -డాక్టర్ వెంకటి, హైదరాబాద్ డీఎంహెచ్వో
సీజనల్, కరోనా లక్షణాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. మూడు రోజుల్లో జ్వరం, జలుబు, దగ్గు వంటివి తగ్గకుంటే కరోనా పరీక్షలు జరిపిస్తాం. సీజనల్ వ్యాధులకు సంబంధించి మలేరియా, డెంగీ, టైఫాయిడ్, డయేరియా నిర్ధారణ పరీక్షలను బస్తీ దవాఖానలు, పీహెచ్సీ, యూపీహెచ్సీలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. సీజనల్ వ్యాధులను దాదాపు బస్తీ దవాఖానల స్థాయిలోనే నివారించేలా చర్యలు తీసుకున్నాం. కరోనా సేవలకు సమాంతరంగా సీజనల్ వ్యాధులకు చికిత్స అందిస్తాం. – డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, రంగారెడ్డి డీఎంహెచ్వో
సీజనల్గా వచ్చే జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలున్న వారికి స్థానిక ఆరోగ్య కేంద్రాల్లోనే పరీక్షలు చేసి మందులు అందజేయనున్నారు. అంతేకాకుండా రోగికి మూడు నుంచి ఐదురోజుల్లో లక్షణాలు తగ్గకపోతే వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కొన్ని ప్రధాన లక్షణాలు, రోగి ట్రావెల్ హిస్టరీ, కాంటాక్ట్ హిస్టరీ తదితరాంశాల ఆధారంగా కరోనా నిర్ధారణ పరీక్షలు జరపనున్నట్లు తెలిపాయి. సీజనల్ వ్యాధుల చికిత్స కోసం ప్రైవేట్లకు వెళ్లకుండా స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లోనే మందులు సిద్ధంగా ఉంచారు.