కరోనా వైరస్ వెలుగుచూడక ముందు తల్లిదండ్రులు పిల్లలను మొబైల్ ఫోన్కు దూరంగా ఉంచేవారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి స్కూళ్ళు మూతబడి ఆన్లైన్ క్లాసులు ప్రారంభమైనందున తల్లిదండ్రులే తమ పిల్లల చేతికి మొబైల్ ఫోన్లు, లాప్టాప్లు, ఐపాడ్లు ఇవ్వవలసి వచ్చింది. బలవంతంగా నాలుగైదు గంటలు వాటిని వినియోగింపజేస్తున్నారు.
ఫోన్లో ఏదైనా సినిమా, వీడియో చూస్తున్నప్పుడు రేడియేషన్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. వీటిని డౌన్లోడ్ చేసుకొని ఇంటర్నెట్ను నిలిపివేసి చూడాలి. రాత్రి పడుకునేముందు మొబైల్ను వేరే రూంలో పెట్టాలి. బెడ్ పక్కనపెడితే నిద్రలేమి, చికాకు, స్ట్రెస్ ఉంటాయి.
లక్షలాది ఐటీ ఉద్యోగులు ‘వర్క్ ఫ్రం హోం’ పేరుతో తమ ఇంటి నుంచి ‘లాప్టాప్’లతో రోజుకు సుమారు 8 గంటలు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది లాప్టాప్లను ఒళ్ళో పెట్టుకొనే పనిచేస్తుంటారు. వైర్లెస్ ఎలక్ట్రానిక్ పరికరాలు, వస్తువులు ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ను విడుదల చేస్తున్నందు వల్ల దీని హానికరమైన ప్రభావం పిల్లలపై, పెద్దలపై పడి సాధారణ సమస్యల నుంచి ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. లాప్టాప్లు, మొబైల్ఫోన్లు, స్మార్ట్ టీవీలు నిత్య జీవితంలో భాగంగా మారాయి. వీటి వినియోగాన్ని ఆపలేము, కనీసం తగ్గించనూ లేము. ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు, లాప్టాప్లు శరీరానికి దగ్గరగా పెట్టుకోవడం వల్ల మానసిక ఒత్తిడి, తలనొప్పి, నీరసం అసహనం, చికాకు, నిద్రలేమి, రోగనిరోధక శక్తి తగ్గడం, శారీరక బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గడం, సంతానలేమి (ఇన్ఫెర్టిలిటి), గర్భస్రావం, గర్భంలోని శిశువుపై దుష్ప్రభావాలు, క్యాన్సర్, చూపు తగ్గడం, మెడనొప్పి, కణజాలంపై ప్రభావం, కేంద్ర నాడీ వ్యవస్థ బలహీన పడటం, బ్రెయిన్ ట్యూమర్, జీర్ణాశయ సమస్యలు వస్తున్నాయని న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో న్యూరాలజీ విభాగపు అధిపతి డాక్టర్ మంజరి త్రిపాఠి వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ విభాగం ఐ.ఏ.ఆర్.సి (ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్) 2011 మే నెలలో రేడియో ఫ్రీక్వెన్సీ మానవులలో క్యాన్సర్కు కారణమయ్యే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది.
ఆధునిక టెక్నాలజీ రెండు వైపులా పదునున్న కత్తి. ఇంటర్నెట్ వల్ల అన్నిరంగాల్లో అభివృద్ధి, వేగం పెరిగింది. నూతన ఆవిష్కరణలకు అవకాశాలు ఏర్పడ్డాయి. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు అందివచ్చిన టెక్నాలజీతో ఐటీ, పారిశ్రామిక రంగంలో గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నాయి. ఇంటర్నెట్ అందుబాటులోకి రాకపోయి ఉంటే కరోనా కాలంలో ఎలా ఉండగలిగే వాళ్ళమో ఊహిస్తేనే భయమవుతుంది. ఇంటర్నెట్తో కోట్లాది మంది స్వయం ఉపాధిని పొందగలిగారు. వివిధ దేశాల ప్రజల మధ్య కమ్యూనికేషన్ బాగా పెరిగింది. సోషల్ మీడియా బాగా విస్తరించింది. ఫేస్బుక్ వినియోగదారుల సంఖ్యే 205 కోట్లకు పైగా ఉంది. వీరిలో 31 కోట్ల మంది భారతీయులు.
ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ను నిలిపివేస్తే స్మార్ట్ టీవీ, వైఫై, రౌటర్లు, సెల్ఫోన్లు, లాప్టాప్లు, కంప్యూటర్లు అన్నీ ఆగిపోతాయి. ఇది వాంఛనీయం కాదు. వీటన్నింటినీ కాదని వందేండ్లకు పూర్వం (విద్యుత్తు వినియోగం లేనికాలపు) స్థితికి వెనక్కిపోలేము. కొవిడ్ విషయంలో తీసుకున్నట్లే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కలిగించే దుష్ప్రభావాల విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ విషయమై నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్న జాగ్రత్తలు ఇలా ఉన్నాయి. మొబైల్ఫోన్ను రోజుకు 20-30 నిమిషాలకు మించి వినియోగించకూడదు. మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఫోన్కు 30-40 సెంటిమీటర్ల దూరంలో ఉండి, ఇయర్ఫోన్స్తో లేదా స్పీకర్ ఫోన్ ఆన్చేసి మాట్లాడాలి. బ్లూ టూత్ కూడా క్షేమకరం కాదు. ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి వెంట తీసుకుపోవాలి. మొబైల్ ఫోన్ను శరీరానికి ఆనిం చి మాట్లాడకూడదు. రింగవుతున్నప్పు డు చెవి దగ్గర పెట్టుకోవద్దు. సిగ్నల్ అందనప్పుడు, లోబ్యాటరీ ఉన్నప్పుడు మొబైల్ఫోన్ వినియోగించవద్దు. పిల్ల లు వాడినప్పుడు ట్రైపాడ్కు ఫోన్ ఫిక్స్ చేసి 30-40 సెం.మీ. దూరం నుంచి ఇయర్ ఫోన్ లేదా స్పీకర్ ఫోన్ ఆన్చేసి పెట్టాలి.
లాప్టాప్ వినియోగించేవారు దాని పేరులో ఉన్నట్లే ల్యాప్(ఒడి)లో పెట్టుకొని వర్క్ చేస్తుంటారు. దీనివల్ల పొట్ట, నడుం కింది భాగంలో రేడియేషన్ ప్రభావంతో అనేక శారీరక సమస్యలు వస్తున్నాయి. ప్రధానంగా సంతానలేమి, జీర్ణాశయపు రుగ్మతలు, గర్భవతులకు గర్భస్రావం, కడుపులో బిడ్డకు అనారోగ్య సమస్యలు రావ చ్చు. లాప్టాప్ను కనీసం 20 సెంటిమీటర్ల దూరంలో వుంచి ఆపరేట్ చేయాలి. లాప్టాప్ కింద దిండు పెట్టుకొని ఒళ్లో పెట్టుకోవడం మరింత ప్రమాదం.
సెల్ఫోన్ వెనుక ఎన్విరో చిప్ను అంటించుకోవడం, లాప్టాప్, స్మార్ట్ టీవీ, వైఫై, రౌటర్లు ఉండే గదిలో ఎన్విరోగ్లోబ్ వంటి రక్షణ పరికరాలు ఉంచడం, హీట్షీల్డ్స్ను లాప్టాప్ కింది భాగంలో ఫిక్స్ చేయడం క్షేమకరం. ఎన్విరోచిప్లు, గ్లోబ్ వంటి పరికరాలు రేడియేషన్ వేవ్స్ స్వభావంలో మార్పు తెస్తాయి. సాధారణంగా ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ వేవ్స్ కాన్స్టంట్(స్థిరం)గా ఉండటం వలన ఎక్కువ కాలం ఈ వేవ్స్ శరీరంపై పడటంతో కణజాలం, డీఎన్ఏలో మార్పులు వచ్చి ట్యూమర్లు ఏర్పడుతాయి. ఎన్విరో చిప్, గ్లోబ్ వంటి పరికరాలు రేడియేషన్ను నిలువరించవు కానీ వాటి ‘స్థిర’ స్వభావాన్ని మార్చగలవు. దీనితో వినియోగదారులపై ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ ప్రభావం అంతగా ఉండదని శాస్త్రవేత్తలు ధృవీకరిస్తున్నారు. ఈ పరికరాలతో పాటు రేడియేషన్ లెవల్స్ (తీవ్రత)ను అంచనావేసే ఈఎంఎఫ్ మానిటర్లు అమెజాన్లో అందుబాటులో ఉన్నాయి. ఈ పరికరాలను గాస్ మీటర్లుగా వ్యవహరిస్తారు.
మొబైల్ టవర్లు 500 మీటర్లకు మించిన దూరంలో ఉంటే రేడియేషన్ ప్రభావం అంతగా ఉండదు. ఇటీవల రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పులో మొబైల్ టవర్లను విద్యాసంస్థలకు, దవాఖానలకు, క్రీడా స్థలాలకు, జైళ్లకు దూరంగా తరలించాలని పేర్కొన్నది. రాష్ట్రప్రభుత్వం మంత్రుల సబ్కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రూపొందించిన విధివిధానాలు అమలవుతాయని స్పష్టం చేసింది. రాజస్థాన్ తరహాలోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రేడియేషన్ నుంచి రక్షణకు గైడ్లైన్స్, చట్టాలు రూపొందించాలి. ఆన్లైన్ పాఠాలు అభ్యసించే మన బిడ్డలను రక్షించుకోవటం తక్షణ కర్తవ్యం.
(వ్యాసకర్త: రాజకీయ విశ్లేషకులు)
వి.ప్రకాశ్