పోస్ట్ కొవిడ్ సమస్యలను ఎలా అధిగమించాలి?
కరోనా నుంచి కోలుకున్నవారు తీవ్ర సమస్యలుంటే వైద్యుడిని సంప్రదించాలి. అనారోగ్య సమస్యలను అధిగమించేందుకు పుష్కలంగా నీళ్లు తాగాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. నడక, వ్యాయామం మంచిది. సమయానికి భోజనం, సరిపడా నిద్ర పోవాలి. వైద్యుడు రాసిచ్చే మందులను నిర్ణీత వ్యవధి వరకు వాడాలి. అందులో రక్తాన్ని పల్చగా చేసే మందులు, విటమిన్లు, ఇతర మందులను డోస్ ప్రకారం వినియోగించాలి.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ): కరోనా నుంచి కోలుకున్నవారిలో శారీరక బలహీనత, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఉస్మానియా జనరల్ మెడిసిన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పీ సృజన్ వెల్లడించారు. ఇటువంటి ఇబ్బందులు స్త్రీలు, మధ్యవయస్కుల్లో కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయన్నారు. పోస్ట్ కొవిడ్ సమస్యలు, అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పీ సృజన్ వివరించిన పలు అంశాలు..!
పోస్ట్ కొవిడ్ సమస్యలు, అవి వచ్చేందుకు కారణం ఏమిటి?
కొవిడ్ వల్ల శరీర రోగనిరోధక వ్యవస్థ విపరీతంగా స్పందించడం, రక్త కణాలపై దాడిచేయడం (ఆటో ఇమ్యూనిటీ) వంటి కారణాలతో కరోనా చికిత్సనుంచి కోలుకొన్నవారిలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. నాడీవ్యవస్థ సరిగా స్పందించక బీపీలో హెచ్చుతగ్గులు, నీరసం, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం, కీలక అవయవాల్లో మార్పులు చోటుచేసుకుని అనారోగ్య పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నాడీ వ్యవస్థ, నరాలు, కండరాలు శ్వాసనాళంపై వైరస్ ప్రభావం కారణంగా.. దగ్గు, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, వాసన, రుచి లేకపోవడం వంటివి కనిపిస్తాయి. దమ్ము, ఆయాసం, దడ, ఛాతిలో నొప్పి, తలనొప్పి, మతిమరుపు, ధ్యాస లేకపోవడం, నిద్రలేమి, తీవ్ర నిరాశ ఆందోళన కలిగిస్తాయి. కరోనా ప్రభావం చర్మంపై చూపితే దద్దుర్లు, వెంట్రుకలు రాలడం వంటివి కరోనా నుంచి కోలుకున్నవారిలో ఉన్నట్టు గుర్తించాం.
కొవిడ్ తర్వాత వచ్చే ఇతర సమస్యలు?
రక్తం గడ్డకట్టడం వల్ల రక్తనాళ సంబంధ వ్యాధులు, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, మ్యూకర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్), ఆస్పర్ జిల్లన్, కాంపిడా వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు.. అతి తక్కువమందిలో కనిపిస్తున్నాయి. చాలారోజులు ఐసీయూలో ఉన్న కారణంగా శ్వాసనాళం మూసుకుపోవడం, ఊపిరితిత్తులు గట్టిగాకావడం, గుండె, కండరాల వాపు వంటివి కూడా వస్తాయి.
కోలుకొన్నవారికి మళ్లీ కరోనా వస్తుందా?
కొవిడ్ వచ్చి తగ్గాక మళ్లీ సోకే అవకాశం 90 రోజుల వరకు చాలా అరుదు. కానీ, కొత్తరకం వైరస్ స్ట్రెయిన్లు వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా తిరిగి కరోనా బారినపడే అవకాశం ఉంటుంది. కోలుకున్నా కూడా కొవిడ్ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి. కరోనా లక్షణాలు వచ్చిన పదిరోజుల తర్వాత.. ఎలాంటి మాత్రలు లేకుండా 24 గంటలు జ్వరం, ఇతర లక్షణాలు లేకుంటే ఐసొలేషన్ ముగించొచ్చు. దవాఖానలో చికిత్స పొందుతున్నవారు వారి ఆరోగ్యస్థితిని బట్టి 20 రోజుల్లో ఐసొలేషన్ ముగించవచ్చు.