మెరుగైన రవాణా కోసం కొత్త రోడ్లు
రూ.185 కోట్లతో నిర్మాణానికి టెండర్లు
ఉమ్మడి జిల్లాలో 280 కిలో మీటర్లు
ఐదేండ్ల వరకు నిర్వహణ రాష్ట్ర సర్కారుదే
వరంగల్, జూన్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు గ్రామాలకు ఈ ఏడాది కొత్తగా 280 కిలో మీటర్ల మేర రోడ్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆరు జిల్లాల పరిధిలోని పల్లెలకు రూ.185 కోట్లతో కొత్త రహదారులు వేయనున్నది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఈ రోడ్లు నిర్మిస్తారు. 60 శాతం, 40 శాతం చొప్పున ఈ నిధులు కేటాయిస్తాయి. కొత్తగా రోడ్లు వేసిన తర్వాత ఐదేండ్ల వరకు వాటి నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. ఇందుకోసం ప్రభుత్వం అదనంగా రూ.12 కోట్లు కేటాయించింది. రోడ్ల నిర్మాణం, నిర్వహణ నిధులు విడుదల కావ డంతో ఈ పనులను త్వరగా పూర్తి చేసేందుకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఏర్పాట్లు చేస్తున్నది. రోడ్ల నిర్మాణంలో భాగంగా అవసరమైన చోట వంతెనలు నిర్మించనున్నారు. తాజాగా చేపట్టిన రోడ్లలో తొమ్మిది బ్రిడ్జిలు కట్టనున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఆరు నిర్మించనున్నారు. వీటి మొత్తం పొడవు 363 మీటర్లుంది. వీటి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.17.43 కోట్లు కేటాయించింది. వరంగల్ రూరల్ జిల్లాలో మూడు బ్రిడ్జిలు నిర్మించనున్నారు. రూ.10.16 కోట్లతో నిర్మించే ఈ బ్రిడ్జిల మొత్తం పొడవు 206 మీటర్లుంది. వరంగల్ అర్బన్ జిల్లాలో రూ.1.25 కోట్లతో 26 మీటర్ల పొడవుతో బ్రిడ్జి నిర్మించనున్నారు. ఈ బ్రిడ్జిల ఐదేండ్ల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.74 లక్షలు కేటాయించింది.
ఏడేండ్లలో 548.74 కిలో మీటర్ల రోడ్లు
తెలంగాణ ప్రభుత్వం మారుమూల పల్లెలకు సైతం తారు రోడ్లు నిర్మిస్తున్నది. అవసరమైన చోట సీసీ రోడ్లతో గూడేలను, తండాలను అనుసంధానం చేస్తున్నది. 2014 జూన్ నుంచి వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని రోడ్లు లేని గ్రామాలకు కొత్త రోడ్ల నిర్మాణం పూర్తయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కొత్తగా 548.74 కిలో మీటర్ల రోడ్లు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో మరమ్మతులు చేయకుండా వదిలేసిన రోడ్లను తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొత్త రోడ్లుగా తీర్చిదిద్దింది. 1750.60 కిలో మీటర్ల రోడ్లను పూర్తి స్థాయిలో మార్చింది. కొత్త రోడ్లకు, మరమ్మతులకు కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.460.35 కోట్లు ఖర్చు చేసింది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల నిర్మాణం, మరమ్మతుల బాధ్యత కాంట్రాక్టర్లే చూసుకునేలా నిబంధన విధించింది. దీంతో వేగంగా మరమ్మతులు చేసే పరిస్థితి నెలకొంది.
మారిన పల్లెలు..
పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖలతోపాటు ప్రత్యేక అభివృద్ధి నిధుల (ఎస్డీఎఫ్)తోనూ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీగా కొత్త రోడ్లు నిర్మించింది. రూ.464 కోట్ల ఎస్డీఎఫ్ నిధుల అంచనాతో పంచాయతీరాజ్ శాఖ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6027 పనులు చేపట్టింది. ఈ పనుల్లో 860 కిలో మీటర్ల పొడవుతో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు పూర్తయ్యాయి. ఇందుకోసం రూ.226 కోట్లు ఖర్చు చేశారు. పల్లెలకు మెరుగైన రవాణా సౌకర్యం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏడేండ్లుగా నిర్మించిన రోడ్లతో గ్రామాల స్వరూపం మారింది. మంచి రోడ్లతో వేగవంతమైన రవాణా వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. అత్యవసర వైద్య సేవలు తగిన సమయంలో అందుతున్నాయి. చదువు, ఉపాధి కోసం సమీప పట్టణాలు, నగరాలకు వెళ్లే వారు పొద్దున వెళ్లి సాయంత్రం వరకు తిరిగి వస్తున్నారు. ప్రభుత్వం కల్పించిన వనరులతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. రైతులకు అవసరమైన పెట్టుబడి సామగ్రిని తెచ్చుకోవడం, పంట ఉత్పత్తులను అమ్ముకోవడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం బాగా ఉపయోగుపడుతున్నది.