సిటీబ్యూరో, జూన్ 3(నమస్తే తెలంగాణ): నకిలీ విత్తనాలు, పెస్టిసైడ్స్ విక్రయిస్తున్న ఓ వ్యాపారిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి సుమారు రూ. 2లక్షల విలువైన విత్తనాలను స్వాధీనం చేసుకుని.., విచారణ నిమిత్తం ఈ కేసును వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్గూడలో పావని హైబ్రీడ్ సీడ్స్ పేరుతో మాసబ్ట్యాంక్కు చెందిన అనుగు చంద్రశేఖర్రెడ్డి సీడ్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం పత్తిపంటలు వేసే సమయం కావడంతో బీటీ కాటన్ సీడ్స్ను సేకరించి, వాటిని ప్యాకెట్లలో నింపి స్టిక్కర్స్ అతికిస్తున్నాడు. దీంతో పాటు నకిలీ పెస్టిసైడ్స్ను కూడా సేకరించి, డబ్బాలలో పెస్టిసైడ్స్ నింపి వాటికి స్టిక్కర్స్ అతికించి రైతులకు విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ జావెద్ బృందం వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి గురువారం దుకాణంలో సోదాలు నిర్వహించారు. కావేరి జాదు, కావేరి మని మేకర్స్తో పాటు వివిధ రకాలైన కూరగాయలు, గడ్డికి సంబంధించిన విత్తనాలు, పెస్టిసైడ్స్ డబ్బాలు, ఖాళీ డబ్బాలు, ప్యాకెట్లు, స్టిక్కర్లు లభించాయి. సుమారు రూ. 2 లక్షల విలువైన విత్తనాలు, పెస్టిసైడ్స్ను స్వాధీనం చేసుకున్నారు. దుకాణ యజమానిని తదుపరి విచారణ నిమిత్తం రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించారు.