హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్నదని, ప్రస్తుతం పాజిటివిటీ రేటు రెండు శాతమే ఉండటం దీనికి నిదర్శనమని ప్రజారోగ్యశాఖ సంచాలకుడు జీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. 3 వారాల లాక్డౌన్ వల్ల ఆశించిన ఫలితాలు కనిపిస్తున్నాయని, కొత్త కేసులు తగ్గి, కోలుకొంటున్నవారి సంఖ్య పెరిగిందని వివరించారు. గురువారం కోఠిలోని డీపీహెచ్ కార్యాలయంలో డీఎంఈ రమేశ్రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా నుంచి సురక్షితంగా ఉండాలంటే పాజిటివిటీ రేటు కనీసం 5% లోపు ఉండాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించగా, ఇప్పుడు మనం 2శాతంతో పూర్తి సురక్షితంగా ఉన్నామని పేర్కొన్నారు. లాక్డౌన్ తొలివారంలో పాజిటివిటీ రేటు 6.4% ఉండగా, మూడో వారానికి 2.1% కి తగ్గిందన్నారు. పడకలు పెద్ద సంఖ్యలో ఖాళీ అయ్యాయని, లాక్డౌన్కు ముందు రాష్ట్రంలో బెడ్ ఆక్యుపెన్సీ 52% ఉంటే, ఇప్పుడు కేవలం 26%గా ఉన్నదని వివరించారు. ఇప్పటికే తొలి విడత జ్వర సర్వే పూర్తి కాగా, 31 జిల్లాల్లో రెండోవిడత సర్వే పూర్తిచేశామని, త్వరలో మూడో విడత సర్వే ప్రారంభించనున్నట్టు తెలిపారు. రెండో విడత సర్వేలో 87 లక్షల ఇండ్లలో పరీక్షలు చేయగా, ఫీవర్ ఓపీ ద్వారా ఇప్పటివరకు 3.5 లక్షల మందికి పరీక్షలు చేశామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఏపీ సరిహద్దు జిల్లాల్లో హెలికాప్టర్ ద్వారా పర్యటించి వైరస్కట్టడిపై దృష్టి సారించామని పేర్కొన్నారు.
ప్రైవేటు మోసాలపై తీవ్ర చర్యలు
114 దవాఖానలపై 185 ఫిర్యాదులు రాగా, అన్నింటికీ షోకాజు నోటీసులు జారీచేసినట్టు శ్రీనివాసరావు చెప్పారు. 22 దవాఖానల కొవిడ్ చికిత్స అనుమతులు రద్దు చేశామని తెలిపారు. అధిక ఫీజు వసూలుచేస్తున్న సందర్భంలో బాధితులకు న్యాయంజరిగేలా చూస్తున్నామన్నారు. దవాఖానల అసోసియేషన్లతో చర్చించి అధిక బిల్లులు వసూలుచేయకుండా చూడాలని కోరినట్టు వివరించారు.
వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది
జన సహాయకులకు వ్యాక్సినేషన్ హైదరాబాద్తోపాటు, వరంగల్లో ప్రారంభించామని, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తామని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం నారాయణగూడలోని ఐపీఎంలో ప్రత్యేకంగా కేంద్రం ఏర్పాటుచేసినట్టు తెలిపారు. స్విగ్గీ, జొమాటో వంటి వారికి 1.4 లక్షల మందికి ఆయా కంపెనీల ద్వారా ఉచితంగా టీకా ఇచ్చేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
థర్డ్ వేవ్ చిన్నారులకని రుజువు కాలేదు: డీఎంఈ రమేశ్రెడ్డి
థర్డ్వేవ్ కూడా మన చేతుల్లోనే ఉన్నదని డీఎంఈ రమేశ్రెడ్డి పేర్కొన్నారు. ముందు జాగ్రత్తలో భాగంగా అన్ని చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. చిన్నారులకు కొవిడ్ వచ్చి తగ్గిన నెల తర్వాత ఎంఐఎస్-సీ వస్తున్నట్టు తెలుస్తున్నదని, అకస్మాత్తుగా జ్వరం, కడపు నొప్పి, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే చిన్న పిల్లల దవాఖానకు తీసుకెళ్లాలని సూచించారు. బ్లాక్ఫంగస్ కేసు లకు సంబంధించి ఈఎన్టీ దవాఖానలో 250, గాంధీలో 100 ఆపరేషన్లు చేశామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి మొత్తంగా 1,100 కేసులు ఉన్నాయని చెప్పారు. బ్లాక్ఫంగస్ ఔషధాలను దవాఖానలే ప్రభుత్వం ద్వారా సమకూర్చుకుంటాయన్నారు. దీనికి సంబంధించిన చికిత్సలు ఇకపై నిజామాబాద్, వరంగల్ సహా ఇతర టీచింగ్ దవాఖానల్లోనూ ప్రారంభమవుతాయని తెలిపారు.