నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్ దవాఖానల లైసెన్సులు రద్దు
అన్ని దవాఖానలు తనిఖీ చేయాలి
సంగారెడ్డి ప్రభుత్వ దవాఖాన ఆవరణలోనే మెడికల్ కాలేజీ
150 సీట్లతో ఏర్పాటు చేస్తాం
లాక్డౌన్తో తగ్గిన కరోనా కేసులు
బ్లాక్ ఫంగస్ సోకకుండా చర్యలు
ధాన్యం సేకరణ వేగంగా పూర్తిచేయాలి
విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలి
సంగారెడ్డిలో ఆర్థిక మంత్రి హరీశ్రావు
వేట్ దవాఖానల్లో కరోనా రోగుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ దవాఖానల లైసెన్స్లు రద్దు చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. శనివారం ఆయన సంగారెడ్డి, జహీరాబాద్లో పర్యటించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించి యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ప్రైవేట్ దవాఖానలను తనిఖీ చేసి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.లాక్డౌన్తో కరోనా కేసులు తగ్గాయని, రోగులకు ఆక్సిజన్, మందుల కొరత లేదన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి పూర్తిచేయాలన్నారు.
సంగారెడ్డి మే 22 (నమస్తే తెలంగాణ) :
ప్రైవేట్ దవాఖానల్లో కరోనా రోగుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ దవాఖానల లైసెన్స్లు రద్దు చేస్తామని మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. శనివారం మంత్రి సంగారెడ్డి కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలోని ప్రైవేట్ దవాఖానలను తనిఖీ చేయాలన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే లైసెన్స్లు రద్దు చేయాలని కలెక్టర్ హనుమంతరావు, డీఎంహెచ్వో గాయత్రీదేవి, కరోనా ప్రత్యేకాధికారి రాజుగౌడ్ను ఆదేశించారు. జిల్లాలోని ముగ్గురు ఆర్డీవోలు దవాఖానలను తనిఖీ చేయాలని సూచించారు. కరోనా రోగులకు బ్లాక్ ఫంగస్ సోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ దవాఖానలో ఆక్సిజన్ సరఫరా చేసే యంత్రా లు, పరికరాలు, మాస్క్లను ఎప్పటికప్పుడు స్టెరిలైడ్ వాటర్తో శుభ్రం చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. సంగారెడ్డిలోని ప్రభు త్వ దవాఖాన క్యాంపస్లోనే 150 సీట్లతో నూతన మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుంచి మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల ప్రారంభిస్తామన్నారు. పటాన్చెరులో త్వరలోనే 200 పడకల ప్రభుత్వ దవాఖానను ఏర్పాటు చేస్తామని, ఇందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తెలిపారు.
లాక్డౌన్తో తగ్గిన కేసులు..
లాక్డౌన్ అమలుతో సంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు 7.2శాతం తగ్గినట్లు చెప్పారు. లాక్డౌన్కు ముందు సంగారెడ్డి జిల్లాలో 22.89శాతం కరోనా కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 15.69 శాతానికి పడిపోయినట్లు తెలిపారు. కేసులు తగ్గడం మంచి పరిణామమన్నారు. లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కరోనా రోగులకు అవసరమైన ఆక్సిజన్, మందులు అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులకు సూచించారు. సంగారెడ్డిలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్లో 6400 రెమ్డెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సెంట్రల్ డ్రగ్స్టోర్ అధికారులు మాట్లాడారు. ప్రతిరోజు సంగారెడ్డి దవాఖానకు 80, జోగిపేట దవాఖానకు 30, నారాయణఖేడ్ దవాఖానకు 30, జహీరాబాద్ దవాఖానకు 50, పటాన్చెరు దవాఖానకు 20 రెమ్డెసివిర్ ఇంజక్షన్లు సరఫరా చేస్తున్నామన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ఇంజక్షన్ కొరత లేకుండా చూస్తున్నట్లు మంత్రి వివరించారు. సదాశివపేటలో ప్రభుత్వ దవాఖానలో 50 ఆక్సిజన్ పడకలతో కరోనా వార్డును ప్రారంభించాలన్నారు. నారాయణఖేడ్ ప్రభుత్వ దవాఖాన నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. సంగారెడ్డిలో ఆర్టీపీసీఆర్ కేంద్రం ఏర్పాటు పనులను సమీక్షించిన మంత్రి, వెంటనే పనులు పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో కొనసాగుతున్న కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్, ఇంటింటా సర్వే వివరాలను తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కిరాణా, కూరగాయలు వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, మెడికల్ షాపు నిర్వాహకులు, హమాలీల వివరాలు సేకరించాలని, త్వరలోనే వారికి వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు.
ధాన్యం సేకరణ త్వరగా పూర్తి చేయండి..
యాసంగి ధాన్యం సేకరణ వేగంగా పూర్తి చేయాలని పౌరసరఫరాలశాఖ, డీఆర్డీఏ, డీసీఎంఎస్ అధికారులను మంత్రి హరీశ్రావు ఆదేశించారు. జిల్లాలో 145 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు అదనపు కలెక్టర్ వీరారెడ్డి మంత్రికి వివరించారు. 20వేల మెట్రిక్ టన్నులకు సంబంధించి ట్యాబ్ ఎంట్రీలు ఇంకా జరుగలేదని, వెంటనే ట్యాబ్ ఎంట్రీలు పూర్తి చేసి రైతులకు డబ్బులు చెల్లించాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డికి మంత్రి సూచించారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం బస్తాలు త్వరితగతిన రైస్ మిల్లులకు పంపించాలన్నారు.
విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచండి ..
వానకాలానికి రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని వ్యవసాయశాఖ అధికారులను మంత్రి హరీశ్రావు ఆదేశించారు. వరిసాగు తగ్గించడంతో పాటు కనీసం 25వేల ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో రైతులు వరిసాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు. వరిసాగు తగ్గించి పత్తి, కంది పంట అధిక విస్తీర్ణంలో సాగుచేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి నర్సింగరావు చెప్పారు. 4.20 లక్షల ఎకరాల్లో పత్తి, 1.30 లక్షల ఎకరాల్లో కంది పంట సాగు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సోయాబీన్ రైతులను పత్తి పంట వేసుకోవాలని కోరారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
సమీక్షా సమావేశంలో కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్చైర్పర్సన్ విజయలక్ష్మి, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సంగారెడ్డి పాల్గొన్నారు.
మూడు అంబులెన్స్లు ప్రారంభం..
కలెక్టరేట్ ఆవరణలో మూడు నూతన అంబులెన్స్లను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి సొంత నిధుల నుంచి జిల్లా కేంద్ర దవాఖానకు అంబులెన్స్, ఐడీఏ బొల్లారంలోని అమెజాన్ ప్యాపిరస్ కెమికల్ కంపెనీ యాజమాన్యం రెండు అంబులెన్లు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి, అమెజాన్ ప్యాపిరస్ కెమికల్ కంపెనీ యాజమాన్యాన్ని అభినందించారు. కరోనా సమయంలో జిల్లాలోని పరిశ్రమలు రోగులను ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.