మంచాల మే21 : పల్లెప్రగతి పనులతో చిత్తాపూర్ గ్రామం ప్రగతి పథంలో దూసుకు పోతున్నది. గతంలో గ్రామంలో ఎక్కడ చూసినా మురుకి కాల్వ లు, గుంతల రోడ్లు, పెంటకుప్పలతో ఈగలు, దోమలతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యేవారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో ప్రవేశపెట్టిన పల్లెప్రగతిలో గ్రామం అభివృద్ధితో పాటు స్వచ్ఛతకు కేరాఫ్గా నిలిచింది. సర్పంచ్ నాగరాజుగౌడ్తో పాటు పాలకవర్గ సభ్యులు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. రెండేండ్ల కాలంలో రూ.60లక్షలతో గ్రామంలో సీసీరోడ్లు, భూగర్భ డ్రైనేజీ, హరితహారంలో మొక్కలు నాటే కార్యక్రమం, వర్మీ కంపోస్ట్యార్డు, వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, డ్వాక్రా భవనం నిర్మించుకున్నారు. ప్రతి రోజూ వీధులను శుభ్రం చేయించడం, హరితహారం మొక్కలకు క్రమం తప్పకుండా నీరందించడం, పంచాయతీ ట్రాక్టర్ ద్వారా తడి, పొడి చెత్తను సేకరించి కంపోస్ట్ యార్డుకు తరలించడంతో గ్రామంలో ఎటు చూసినా పరిశుభ్ర వాతావరణం నెలకొన్నది. గ్రామంలో సీసీరోడ్లు, వీధి దీపాలు, రోడ్డుకు ఇరువైపులా మొక్క లు కునువిందు చేస్తున్నాయి.
రూ.12.60 లక్షలతో వైకుంఠధామం నిర్మాణం..
చిత్తాపూర్ గ్రామంలో పల్లెప్రగతిలో భాగంగా రూ.12.60లక్షలతో వైకుంఠధామం నిర్మించారు. ఇందులో స్నానాల గదులతో పాటు ఇతర సదుపాయాలను కల్పించారు. గతంలో వైకుంఠధామం లేకపోవడంతో ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు చేయడానికి ఇబ్బందులు పడేవారు. నేడు వైకుంఠధామం నిర్మాణంతో సమస్య తీరింది.
వర్మీ కంపోస్టు యార్డు ఏర్పాటు..
గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్త నుంచి వర్మీ కంపోస్ట్ తయారీకి రూ.2.60లక్షలతో వర్మీ కంపోస్ట్ యార్డును నిర్మించారు. గ్రామంలో రోజూ తడి, పొడి చెత్తను ట్రాక్టర్ ద్వారా సేకరించి ఎరువు తయారీకి ఉపయోగిస్తున్నారు. ఈ ఎరువును హరితహారం మొక్కలకు అందజేయడంతో ఏపుగా పెరుగుతున్నాయి.
రూ.6లక్షలతో ట్రాక్టర్ కొనుగోలు..
గ్రామంలో చెత్త సేకరణతో పాటు హరితహారంలో మొక్కలకు నీరు పోయడానికి పంచాయతీ నిధుల నుంచి రూ.6లక్షలతో ట్రాక్టర్ను కొనుగోలు చేశారు. ట్రాక్టర్ ద్వారా ప్రతి రోజూ ఉదయం గ్రామంలో చెత్త సేకరించి వర్మీ కంపోస్ట్ యార్డుకు తరలిస్తారు. అనంతరం ట్యాంకర్ ద్వారా గ్రామంలో హరితహారం మొక్కలు, చెట్లకు నీరు అందజేస్తున్నారు.
వన నర్సరీ ద్వారా 12 వేల మొక్కలు పెంపకం..
మహాత్మా గాంధీ వన నర్సరీ ద్వారా చిత్తాపూర్లో వివిధ రకాల 12వేల మొక్కలను పెంచుతున్నారు. ఉదయం, సాయంత్రం మొక్కలకు నీరు పోసేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. నర్సరీలో మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు పంచాయతీ ద్వారా అక్కడ ప్రత్యేక బోరును ఏర్పాటు మొక్కలకు నీరు అందిస్తున్నారు.
రూ.2 లక్షలతో పల్లెప్రకృతి వనం ఏర్పాటు..
పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో రూ. 2లక్షలతో పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. వనంలో వివిధ రకాల పండ్లు, పూలమొక్కలను పెంచడమే కాకుండా ప్రతి రోజూ నాటిన మొక్కలకు నీటిని అందిస్తున్నారు. పల్లెప్రకృతి వనంలో నాటిన మొక్కలను రోజూ సర్పంచ్ పర్యవేక్షిస్తున్నారు.