న్యూఢిల్లీ: వచ్చే నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు కోచ్గా మాజీ కెప్టెన్, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చైర్మన్ రాహుల్ ద్రవిడ్ వ్యవహరించనున్నాడు. జూలైలో భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. ఈ సందర్భంగా ఇరుజట్లు ఆరు మ్యాచ్ల్లో తలపడనున్నాయి. 2014 తర్వాత ద్రవిడ్ టీమిండియా ప్రధాన జట్టుతో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి. 2014లో భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటించినప్పుడు బ్యాటింగ్ కన్సల్టెంట్గా వ్యవహరించాడు.
శ్రీలంక పర్యటన సమయంలోనే కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఇంగ్లండ్లో టెస్ట్ సిరీస్ ఆడనుంది. దీంతో ప్రధాన కోచ్ రవిశాస్త్రితో సహా కోచింగ్ బృందం టెస్ట్ జట్టుతో ఉండనుంది. ఈ నేపథ్యంలో శ్రీలంకకు వెళ్లనున్న భారత జట్టుకు మరో కోచ్ అవసరం ఏర్పడింది. దీంతో ప్రస్తుతం ఎన్సీఏ హెడ్గా ఉన్న ద్రవిడ్ను ఎంపిక చేశారు. ఈ సిరీస్ కోసం జట్టును ఇంకా సెలెక్ట్ చేయాల్సి ఉంది.
కాగా, ద్రవిడ్ ఇప్పటికే అండర్-19, ఇండియా-ఏ జట్టు సభ్యులందరితో కలిసి పనిచేశాడు. దీంతో శ్రీలంక వెళ్లనున్న భారత జట్టుకు ఎంపికయ్యే ఆటగాళ్లకు మంచి అవకాశం కలిగింది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన బ్యాట్స్మెన్లలో ఒకడైన ద్రవిడ్ మార్గదర్శకత్వంలో యువ జట్టు తలపడనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది. జూలై 13, 16, 19 తేదీల్లో వన్డే మ్యాచ్లు, మూడు టీ 20 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ సిరీస్కు ముందు ఎంపికైన ఆటగాళ్లందరు హోం క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి