న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచేందుకు మరిన్ని ఫార్మా కంపెనీలకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా యూనివర్సిటీల వైస్ఛాన్స్లర్లతో జరిగిన వర్చువల్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ డిమాండ్.. సరఫరా కంటే ఎక్కువగా ఉంటే సమస్య ఉత్పన్నమవుతుందని.. ఒక సంస్థకు బదులుగా.. మరో పది కంపెనీలు వ్యాక్సిన్ తయారీకి లైసెన్స్ ఇవ్వాలన్నారు. మొదట దేశంలో సరఫరా చేసిన తర్వాత.. మిగులు ఉంటే ఎగుమతి చేయవచ్చన్నారు. కేవలం 15-20 రోజుల్లోనే దీన్ని చేయవచ్చని పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రంలో రెండు, మూడు ప్రయోగశాలలున్నాయని, కొవిడ్ -19 వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడానికి వారికి ఫార్ములా ఇవ్వాలన్నారు. ఆత్మనిర్భర్ భారత్ను తాము కోరుకుంటున్నామని, దేశంలోని అన్ని జిల్లాలూ మెడికల్ ఆక్సిజన్ విషయంలో స్వయం సమృద్ధి సాధించాలని అన్నారు.
అయితే, ఇప్పటికీ ముడి సరుకు దిగుమతిపై భారత్ ఆధారపడుతుందని తెలిపారు. కరోనా మమమ్మారి కాలంలో ప్రజలు పాజిటివ్ ఆలోచనలు, ఆత్మస్థైర్యం కలిగి ఉండాలని కేంద్రమంత్రి సూచించారు. ఇదిలా ఉండగా.. భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థలు ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయి. ప్రస్తుతం టీకా డ్రైవ్లో మూడు వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగం కింద అనుమతి ఇవ్వగా.. కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వీ అందుబాటులోకి వచ్చాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ త్వరలోనే స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ను ఉత్పత్తి చేయనుంది. జనవరి 16న ప్రారంభమైన కొవిడ్ టీకా డ్రైవ్లో భాగంగా ఇప్పటి వరకు 18,58,09,302 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.