ఫ్లోరిడా: మిస్ యూనివర్స్ పోటీల్లో ఈ ఏడాది ఆండ్రియా మెజా విజేతగా నిలిచింది. మెక్సికో దేశానికి చెందిన మెజా.. తన అందాలతో ఆకట్టుకోవడమే కాదు.. జడ్జిలు వేసిన ప్రశ్నలకు చురుకైన సమాధానాలు కూడా ఇచ్చింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న హార్డ్ రాక్ హోటల్లో కలర్ఫుల్గా ఈ వేడుక జరిగింది. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో మిస్ యూనివర్స్ పోటీలను ఏడాది పాటు వాయిదా వేశారు. మే 16వ తేదీన జరిగిన ఈ కార్యక్రమాన్ని మాజీ మిస్ యూనివర్స్ విజేత ఒలివియా కుల్పో నిర్వహించారు. స్టేట్మెంట్ రౌండ్లో మెక్సికో బ్యూటీ ఆండ్రియా తన ఆన్సర్లతో అందర్నీ మెప్పించింది. మారుతున్న బ్యూటీ ప్రమాణాలపై ప్రశ్న వేయగా.. రోజు రోజుకూ మన సమాజం అడ్వాన్స్ అవుతున్నదని, అలాగే మూస ధోరుణుల్లో ప్రవర్తించేవాళ్లూ ఉన్నారని, అందం అనేది మన ఆలోచనల్లో, మన గుండెల్లో ఉంటుందని, అది మన ప్రవర్తనను నియమిస్తుందని, మన విలువను చాటేందుకు అందం ఒక కొలమానంగా నిలుస్తుందని ఆండ్రియా పేర్కొన్నది.
ఇక మహమ్మారి కరోనా పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారని కూడా జడ్జిలను ఆమెను ప్రశ్నించారు. కోవిడ్ లాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు సరైన పద్ధతి అంటూ ఏదీ లేదని, ఒవకేళ తానే నేతనైతే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాను ముందుగా లాక్డౌన్ విధించే దానినని పేర్కొన్నది. ఎందుకంటే కరోనా ఉగ్రరూపం దాలిస్తే ప్రాణాలను కాపాడుకోలేమని, అందుకే లాక్డౌన్ అవసరం అని ఆమె తెలిపింది. మన ప్రజల్ని మనమే రక్షించుకోవాలన్నది. అందుకే ముందు నుంచి లాక్డౌన్ అమలు చేసేదాన్ని అని అందాల భామ ఆండ్రియా పేర్కొన్నది.
74 దేశాలకు చెందిన ముద్దుగుమ్మలు ఈ ఈవెంట్లో పాల్గొన్నాయి. ఫైనల్ రౌండ్కు కేవలం 21 మంది వెళ్లారు. చివరిసారి మిస్ యూనివర్స్ పోటీలను 2019లో నిర్వహించారు. ఆ పోటీల్లో మిస్ సౌతాఫ్రికా జోజిబిని తుంజి విజేతగా నిలిచింది.