న్యూఢిల్లీ : తౌక్టే తుఫాను కర్ణాటకలో బీభత్సం సృష్టిస్తోంది. తీర ప్రాంతంలోని ఆరు జిల్లాలు, మల్నాడ్లో భారీ వర్షపాతం నమోదైందని కర్ణాటక రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (కేఎస్డీఎంఏ) ఆదివారం తెలిపింది. తుఫానుకు 73 గ్రామాలు ప్రభావితమయ్యాయని, ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారని అధికారులు పేర్కొన్నారు. తౌక్టే అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని, ఈ నెల 18న ఉదయం గుజరాత్ వద్ద తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం పంజిమ్-గోవాకు నైరుతి దిశలో 170 కిలోమీటర్ల దూరం, ముంబై 520 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంది.
18న తెల్లవారు జామున పోరుబందర్ మహువా (భావ్నగర్ జిల్లా) వద్ద తీరం దాటుతుందని చెప్పింది. ఓ వైపు కరోనాతో రాష్ట్రం కొట్టుమిట్టాడుతుండగా.. మరో వైపు తౌక్టే తుఫాను ముంచుకువస్తున్నది. మరో వైపు గోవా తీర ప్రాంతాలు, రాజధాని పనాజీని తుఫాను తాకింది. తుఫాను నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టేందుకు 100 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచినట్లు ఓ అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా.. తీర ప్రాంతాల్లో తుఫాను పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని సీఎం బీఎస్ యెడ్యూరప్ప పేర్కొన్నారు. చేపట్టాల్సిన సహాయక చర్యలపై బాధిత జిల్లాల ఇన్చార్జి మంత్రులు, కలెక్టర్లతో మాట్లాడుతున్నట్లు తెలిపారు.