అన్నం వద్దంటూ.. ఇల్లంతా కలె తిరుగుతుంటె.. “ఇది నాన్న ముద్ద.. ఇది అమ్మ ముద్ద” అని పేరు పెడుతూ.. ఇంకొంచెం.. ఇంకొంచెం అంటూ పిల్లల కడుపునింపే ఆ తల్లి కసురుకుంటున్నది. ఆనందంతో అలుముకునే తండ్రి పాదాలు ఆమడ దూరంలోనే ఆగిపోతున్నాయి. కారణం ప్రేమ లేక కాదు. ఆప్యాయత లేక అంతకన్నా కాదు. కేవలం కరోనా సృష్టించిన భయోత్పాతం. మహమ్మారి దెబ్బకు మమతలకు తరుగుతున్న విషాదం. ఇది నాణేనికి ఒక పార్శ్యం. మరోవైపు ఏడాదికి పైగా ఇల్లే చెరసాలగా గడపాల్సిన దైన్యం. స్మార్ట్ ఫోన్లతో కాలక్షేపం చేస్తున్న బాల్యం వసివాడి పోతున్నది. ఆదిలోనే దీనిని నివారించకపోతే దీర్ఘకాలంలో పెను సమస్యగా ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
ఏ విపత్తు సంభవించినా చివరికి బాధితులుగా మిగిలేది మహిళలు, చిన్న పిల్లలు. ప్రస్తుతం కరోనా విలయం వల్ల అత్యధికంగా మానసిక వేదనకు గురవుతున్నది కూడా వారే కావడం శోచనీయం. సాధారణంగా మూడు నుంచి 10 ఏళ్ల వయస్సు పిల్లలు అధికంగా పరిశీలన, అనుకరణ, అభ్యాసన ద్వారా ఎక్కువ విషయాలను నేర్చుకుంటుంటారు. అది కూడా వారి సమ వయస్కులతోనైతే మరింత సులువుగా, తొందరగా ఆకళింపు చేసుకుంటారు. ప్రస్తుతం, దీర్ఘకాలంగా పాఠశాలలు మూసివేయడంతో పిల్లలు తమ సమ వయస్కులను (పీర్ గ్రూప్) కలిసే అవకాశం లేకుండా పోవడంతో చిన్నారులు ఒంటరితనానికి గురవుతున్నారు. ఏడాదికి పైగా నాలుగ్గోడల మధ్యనే నలిగిపోతున్నారు. ఆన్లైన్లో పాఠాలు వింటున్నా అవి అర్థం కాగా ఒత్తిడికి గురవుతున్నారు. అభ్యాసన ప్రక్రియలో ఇబ్బందులను అధిగమించలేక విషయ అవగాహనలో వెనకబడిపోతున్నారు. కొందరు తల్లిదండ్రులు దగ్గరుండి తమ పిల్లలకు విద్యాభ్యాసనలో ఎదురవుతున్నా సమస్యలను పరిష్కరిస్తున్నా చాలా మంది పేరేంట్స్ మాత్రం అది పట్టించుకోని దుస్థితి. ఎవరి పనుల్లో వారు నిమగ్నమవుతుండటంతో చిన్నారులు మరింత కృంగిపోతున్నారు.
ఆర్థిక తదితర సమస్యల దృష్ట్యా తల్లిదండ్రులు పిల్లలను నిర్ల క్ష్యం చేయడమే కాదు, వారి అసహాయతను, అసహనాన్ని పిల్లలపై చూపుతున్న దుస్థితి నెలకొంది. పిల్లల మానసిక ప్రవర్తనకు సంబంధించి కారణాలు తెలియక, మరోవైపు అవగాహన చేసుకోలేక కొందరు తల్లిదండ్రులు వారిని దూ షిస్తూ, కొడుతూ సరైన మార్గంలో పె ట్టాలని చూస్తున్నారు. అయినా, పిల్లలు మాట వినకపోగా మరింత మొండిగా తయారవుతున్నారు. ఇ టీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో 22.6 శా తం మంది పిల్లలు శారీరక హింసకు, 43.9 శాతం మం ది మానసిక వేధింపులకు గురవుతుండగా, 16.3 శా తం మంది ఆత్మీయ స్పర్శ దక్కడం లేదని, 18.4 శాతం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారని తెలిపింది.
ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలే. ఇంతకు ముందు సెలవు రోజుల్లో బయటకు వెళ్లేవాళ్లం. ఈ కరోనా వల్ల ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. పిల్లలేమో బయటకు వెళ్దామంటూ మారాం చేస్తున్నారు. మరోవైపు ఇంట్లోనే ఎప్పుడూ వీడియో గేమ్స్ ఆడుతున్నారు. వద్దంటే అల్లరి చేస్తూ కోపంతో వస్తువులను విసిరికొడుతున్నారు. చిరాకు పడుతున్నారు. అన్నం కూడా బలవంతంగా తింటున్నారు. – జీవీఎస్ సుధాకర్, రెడ్డీస్ ల్యాబ్ ఉద్యోగి
కరోనా వల్ల పిల్లలను దగ్గరికి తీసుకోవాలంటే భయంగా ఉంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా, శానిటైజ్ చేసుకున్నా లోపల ఎక్కడో అనుమానం. ఇక చాలా రోజులుగా ఇంట్లోనే ఉండేసరికి పిల్లలు మూడీ గా ఉంటున్నారు. ఎప్పుడూ టీవీలో కార్టూన్ చానల్స్ చూడటం లేదంటే, సెల్ఫో న్ తీసుకుని వీడియో గేమ్స్ ఆడటం ఇదే పని. వద్దంటే ఏ డుస్తున్నారు. అన్నం కూడా సరిగా తినడం లేదు. – దివ్య, ఎర్రగడ్డ, గృహిణి
చిన్నారులను ఒంటరిగా వదిలేయకుండా వారితో ఎక్కువ సమయం గడపాలి. వారిలో ఉత్సాహం నిం పుతూ ఉండాలి. వీలు చేసుకుని వారితో ఆడిపాడా లి. అప్పుడే, ఒంటితనం అనే భావం వారి దరిచేర దు. ఇక వెంటబెట్టుకుని ఇంట్లోని చిన్న చిన్న పనులను చేయించాలి. పెయింటింగ్స్ వేసేలా చిన్నారులను ప్రోత్సహించాలి. వారి మనసును మరల్చాలి. పుస్తకాలను చదివించాలి. – డాక్టర్ వీరేంద్ర, సైకియాట్రిస్ట్
కరోనా నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్నపిల్లలకు జ్వరం, జలుబు తదితర వైరల్ ఇన్ఫెక్షన్స్ సహజం. అనవసర భయానికి గురై వైద్యశాలలకు పరుగులు తీయొద్దు. కుటుంబంలో పాజిటివ్ ఉన్నవారు ఎవ రూ లేనట్లయితే జాగ్రత్తలను పాటిస్తూ పిల్లలను దగ్గరికి తీసుకోవచ్చు. ముద్దులు పెట్టడం వంటివి చేయకూడదు. వేడుకలు, శుభకార్యాలకు పిల్లలను తీసుకెళ్లకూడదు. – డాక్టర్ కృష్ణప్రసాద్, పిడియాట్రిషన్