యూడైస్ నమోదుకాని వారికీ సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బంది
రామగిరి, మే 10 : కరోనాతో పాఠశాలలు మూతపడిన విషయం విదితమే. దీంతో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందికి వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించడంతో గత మాసంలోనే ఉపాధ్యాయులు, సిబ్బందికి సాయం అందింది. అయితే యూడైస్లో నమోదైన వారికి మాత్రమే ఈ సాయం అందగా మిగిలిన ఉపాధ్యాయులు, సిబ్బంది తీవ్ర మనోవేదనలో పడ్డారు. యూడైస్లో నమోదుచేస్తే పీఎఫ్, ఇతర సౌకర్యాలు కల్పించాల్సి వస్తుందన్న కుటిలబుద్ధితో ఉన్న యాజమన్యాల అనాలోచిత వైఖరి ఉపాధ్యాయులు, సిబ్బందికి నష్టం కలిగించిందనే ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో యూడైస్లో నమోదు కాని వారికీ లబ్ధి కలుగుతుండటంతో వారి ఆందోళనకు తెర దించినట్లయ్యింది. వీరికి సహితం రూ.2వేలు, ఉచితంగా 25కిలోల సన్నబియ్యం ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీచేయడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మరో 6,950మందికి లబ్ధి కలుగనుండటంతో ఆయా కుటుంబాల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా మరో 80వేల మంది ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి కరోనా ఆర్థిక సాయాన్ని అందించాలని సీఎం కేసీఆర్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల నిర్వాహకులు చేసిన తప్పిదంతో నష్టపోయిన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పనిచేస్తూ యూడైస్లో నమోదు కాని ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రభుత్వ సాయం రూ.2వేలు, 25కిలోల ఉచిత సన్నబియ్యం అందనున్నాయి.
యాజమాన్యాల అనాలోచిత వైఖరితోనే నష్టం..
ఫ్రభుత్వం, విద్యాశాఖ నిబంధనల మేరకు కచ్చితంగా ఆయా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బంది వివరాలను యూనిఫైడ్ డిస్ట్రిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్(యూ-డైస్)లో నమోదు చేయాలి. విద్యాశాఖాధికారులు సహితం పదేపదే చెప్పినా పాఠశాలల నిర్వాహకులు నిర్లక్ష్యం చేశారు. కొన్ని పాఠశాలల యాజమన్యాలు తాజా వివరాలు నమోదు చేయడంతో పరిగణలోకి రాలేదు. చాలా పాఠశాలల యాజమన్యాలు పూర్తి వివరాలు నమోదు చేస్తే వారికి పీఎఫ్, ఈఎస్ఐ, ఇతర సౌకర్యాలు కల్పించాల్సి వస్తుందని నమోదు చేయకుండా వదిలేశారు.
ఉమ్మడి జిల్లాలో 6,950మందికి లబ్ధి
ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6,950మంది ఉపాధ్యాయులు, సిబ్బందికి సాయం అందనుంది. వీరందరికీ సాయం అందితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది అందరికీ సాయం అందించినట్లే అవుతుంది. ఈ సాయం అందాల్సిన వారు నల్లగొండ జిల్లాలో 3050, సూర్యాపేట జిల్లాలో 2500, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1400మంది ఉన్నారు.