ఏపీ కరోనా బాధితుల అంబులెన్స్లకు బ్రేక్
అనుమతి లేకుంటే సరిహద్దుల్లో నిలిపివేస్తున్న రాష్ట్ర పోలీసులు
హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ)/ ఉండవెల్లి: మెరుగైన వైద్యంకోసం ఇతర రాష్ర్టాల నుంచి కరోనా బాధితులు పెద్దసంఖ్యలో తెలంగాణకు తరలివస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వ యం త్రాంగం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో గట్టి నిఘా ఏర్పాటుచేసింది. ముందస్తు అనుమతి లేకుండా ఏపీ నుంచి హైదరాబాద్కు కరోనా బాధితులను తరలిస్తున్న అంబులెన్స్లను పోలీసులు సరిహద్దుల్లో అడ్డుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దుతోపాటు కర్నూలు జిల్లా పుల్లూరు టోల్గేట్ వద్ద తెలంగాణ పోలీసులు నిశితంగా తనిఖీలు చేపడుతున్నారు. కరోనా రోగులతో ఉన్న అంబులెన్స్లను వెనక్కి పంపుతున్నారు. ముందుగా దవాఖానల నుంచి అనుమతి తీసుకున్నారా? దవాఖానలో పడకలు ఖాళీగా ఉన్నాయా? అనే విషయాలను పరిశీలిస్తున్నారు. ఏపీలో రోజుకు 14 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దాంతో కర్నూ లు, అనంతపురం, కడప జిల్లాల నుంచి చాలామంది తెలంగాణలో చికిత్సకోసం తరలివస్తున్నా రు. ప్రస్తుతం తెలంగాణలోని సరిహద్దు జిల్లాలతోపాటు హైదరాబాద్ దవాఖానల్లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి చేరిన కరోనా బాధితులు ఎక్కువగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది.