పల్లె ప్రగతితో కొత్తరూపు
రెండేండ్లలో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ
గ్రామంలో 70 శాతం పూర్తయిన సీసీరోడ్లు
రూ.6 లక్షలతో పల్లెప్రకృతి వనం, నర్సరీల ఏర్పాటు
వర్షం పడితే రోజుల తరబడి చెరువును తలపించే ప్రధాన రహదారి.. గ్రామంలోని చిన్న వీధులన్నీ బురదమయం.. విద్యుత్ సమస్యలు, అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ.. ఇది హుజూర్నగర్ మండలంలోని అమరవరం గ్రామంలో రెండేండ్ల కిందటి పరిస్థితి. కానీ ఇప్పుడా దుస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతికి ప్రతినెలా నిధులు విడుదల చేస్తుండడంతో గ్రామం ప్రగతిపథంలో ముందుకు సాగుతున్నది. సర్పంచ్ గుజ్జుల సుజాతాఅంజిరెడ్డి ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధివైపు నడిపిస్తున్నారు.
రూ. 20 లక్షలతో వెటర్నరీ దవాఖాన నిర్మాణం
అమరవరం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత గ్రామం కావడంతో పశుసంపద ఎక్కువగా ఉంటుంది. వాటికి వ్యాధులు ప్రబలినప్పుడు చికిత్సకు దూర ప్రాంతానికి వెళ్లాల్సి వస్తున్నది. దీంతో ఎమ్మెల్యే సైదిరెడ్డి డీఎంఎఫ్ (డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్) నిధుల నుంచి రూ. 20 లక్షలు మంజూరు చేయించి సంవత్సర కాలంలోనే వెటర్నరీ దవాఖానను నిర్మించారు. అలాగా డీఎంఎఫ్ నుంచి మంజూరైన మరో రూ.20 లక్షలతో గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించారు. గ్రామానికి ఉత్తరంవైపు ఉన్న లింగమంతుల గుట్ట అభివృద్ధికి డీఎంఎఫ్ నుంచి మరో రూ.25 లక్షలు కేటాయించి పలు అభివృద్ధి పనులు చేస్తున్నారు.
పల్లెప్రగతితో మార్పు
పల్లెప్రగతిలో భాగంగా అమవరంతోపాటు అనుబంధ గ్రామంగా ఉన్న అమర్నగర్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుస్తున్నారు. రూ. 5 లక్షలతో రెండు పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. రాళ్లు, గుట్టలుగా ఉన్న రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని చదును చేసి రూ. 12. 50 లక్షల వ్యయంతో శ్మశాన వాటిక పనులు చేపట్టగా చివరి దశకు చేరుకున్నాయి. రూ. 2.50 లక్షలతో చేపట్టిన సెగ్రిగేషన్ షెడ్డు పూర్తయి అందుబాటులోకి వచ్చింది. నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలు సిద్ధం చేస్తున్నారు. గ్రామంలో బురదగా మారిన వీధుల్లో రూ. 7 లక్షలతో గ్రావెల్ తోలించి పరిశుభ్రంగా మార్చారు. 9వ వార్డులో చాలా కాలంగా ఉన్న లో ఓల్టేజీ నియంత్రణకు 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ఇంకా గ్రామంలో కొత్తగా విద్యుత్ స్తంభాలతోపాటు వంద ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా 2,200 మొక్కలు నాటి ట్రీగార్డ్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికీ చెత్త బుట్టలను అందించి ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరిస్తున్నారు. గ్రామంలో దోమల నివారణకు ఫాగింగ్, పిచ్చి మొక్కల నివారణకు క్రిమిపాస్ పిచికారీని క్రమం తప్పకుండా నిర్వహిస్తూ పారిశుధ్యానికి ప్రాధాన్యతనిస్తున్నారు.
గ్రామానికి మంజూరైన నిధులు
రెండేండ్లలో డీఎంఎఫ్ నిధులు రూ.60 లక్షలు, ఎస్ఎఫ్సీ నిధులు (స్టేట్ ఫైనాన్స్ కమిషన్) రూ. 24 లక్షలు, ఎస్డీఎఫ్ (స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్) రూ.15 లక్షలు, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 35 లక్షలు, ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ 19 లక్షలు పంచాయతీకి వచ్చాయి.
గ్రామంలో నిర్మించిన డ్రైనేజీలు
రూ. 5 లక్షలతో బస్టాండ్ నుంచి బొడ్రాయి వరకు
రూ. 1. 50 లక్షలతో ఆర్ అండ్ బీ రోడ్ నుంచి ఉస్తెల శ్రీనివాసరెడ్డి ఇంటి వరకు
రూ. 5 లక్షలతో 1వ వార్డు ముదిరాజ్ కాలనీలో
రూ. 5 లక్షలతో 10, 11 వార్డు యాదవబజార్లో..
రూ. 1.20 లక్షలతో రామాలయం వెనుక వీధి నుంచి ఆర్అండ్బీ రోడ్డు వరకు
రూ. 2.25 లక్షలతో ఆర్అండ్బీ రోడ్డు నుంచి ఆజంనేయస్వామి గుడి వరకు డ్రైనేజీలు నిర్మించారు.
రూ. 2 లక్షలతో ఏడు కల్వర్టుల నిర్మాణం
అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం..
గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్న నిధులు, ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల పురోగతికోసం అమలు పరుస్తున్న కార్యక్రమాలు మా లక్ష్యానికి చేయూతనిస్తున్నాయి. పల్లె ప్రగతిలో భాగంగా వచ్చిన నిధులతో డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మిస్తున్నాం. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి సహకారంతో త్వరలోనే గ్రామంలో గ్రంథాలయం, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం, వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తాం. – సుజాతాఅంజిరెడ్డి, సర్పంచ్
గతంలో ఇన్ని పనులు చేయలే..
ఇంతకుముందు కూడా శానా మంది సర్పంచులు పని చేసిర్రు. కానీ ఇంతగా ఎన్నడూ చేయలే. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఊర్లను బాగు చేస్తందుకు ఎక్కువ డబ్బులిస్తున్నది. సర్పంచ్ కూడా అన్ని పనులు చేయిస్తున్నది. ఇప్పుడు నీళ్ల సమస్య లేదు. సీసీ రోడ్లు మంచిగైనయి. మురికి కాల్వలు కట్టించిర్రు. మరో పదేళ్ల దాకా సరిపోను పనులు చేసిర్రు.
అన్ని పనులు చేసిర్రు..
కొత్త సర్పంచ్ ఎక్కి రెండేండ్లు అయితాంది. పాడుబడ్డ బోరింగులు బాగు చేసిర్రు. ఈ మధ్యనే ఊళ్లో కొత్తగా పశువుల ఆసుపత్రి కట్టిర్రు. శ్మశాన వాటిక కూడా అయిపోవచ్చింది. కరెంటు స్తంభాలకు లైట్లు వేసిర్రు. ట్రాక్టర్లో చెత్తను ఎప్పటికప్పుడు తీసుకుపోతున్నరు. అప్పటికి ఇప్పటికి మా ఊరు ఎంతో మారింది.
-బండి హనుమయ్య, గ్రామస్తుడు