న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం నలుగురు ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. ఆయా రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితులపై ఆరా తీశారు. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ల ముఖ్యమంత్రులు ఉద్ధవ్ థాక్రే, ఎంకే స్టాలిన్, శివరాజ్సింగ్ చౌహాన్, జైరామ్ ఠాకూర్లకు ప్రధాని ఫోన్ చేసి మాట్లాడారు. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్కు తొలుత ప్రధాని ఫోన్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితిపై ఆరా తీశారు. రాష్ట్రానికి వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించడానికి కేంద్రం అనుమతి కోరిన రోజే ఉద్ధవ్తో మోదీ మాట్లాడారు.
ఇక ప్రధానితో మాట్లాడిన తర్వాత ఆ వివరాలను ట్విటర్లో వెల్లడించారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. తమ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతూ, రికవరీ రేటు పెరుగుతున్నట్లు చౌహాన్ చెప్పారు. తమ రాష్ట్రం తీసుకుంటున్న చర్యలపై ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారని, అవసరమైన సాయం అందిస్తామని చెప్పినట్లు ఆ ట్వీట్లో తెలిపారు. శుక్రవారం కూడా ప్రధాని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు ఫోన్ చేయడం.. దీనిపై సోరెన్ విమర్శలు గుప్పించడం, దానికి ఏపీ సీఎం జగన్ కౌంటర్ వేయడం తెలిసిందే.