ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభం
ప్రతి వెయ్యి మందికి ముగ్గురు సిబ్బందితో సర్వే
లక్షణాలు ఉంటే మెరుగైన చికిత్స, మందులు
ఆదిలాబాద్, మే 5 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా మహమ్మారి కట్టడికి సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ఇంటింటికీ వెళ్లి ప్రతి కుటుంబ సభ్యుడికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సంకల్పించింది. ఈ మేరకు ప్రతి వెయ్యి మంది జనాభాకు ముగ్గురు సభ్యుల చొప్పున సర్వే నిర్వహించనున్నారు. ఇందులో ఏఎన్ఎం, ఆశ వర్కర్, పంచాయతీ, రెవెన్యూ, అంగన్వాడీ కార్యకర్తలు, ఐకేపీ, మెప్మా సిబ్బంది ఉంటారు. వీరు పరీక్షలు నిర్వహించి, కొవిడ్ లక్షణాలు ఉంటే మందులు ఇస్తారు. నాలుగు రోజుల పర్యవేక్షణ అనంతరం తగ్గకపోతే దగ్గరలోని కొవిడ్ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తారు. ఫలితంగా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందని సర్కారు భావిస్తున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా నియంత్రణకు వైద్యశాఖ అధికారులు ముందస్తు ప్రణాళికలతో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా జిల్లా వైద్యశాలల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ర్యాపిడ్ కిట్ల ద్వారా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు పాజిటివ్ కేసులకు, వారి ఆరోగ్య పరిస్థితికి అనుకూలంగా వైద్యం అందిన్నారు. జిల్లా కేంద్రాల్లోని వైద్యశాలల్లో ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆక్సిజన్, మంచాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. హోం ఐసొలేషన్లో ఉన్న వారికి కొవిడ్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. వ్యాధి నయం అయ్యేంత వరకు వైద్యాధికారులు పర్యవేక్షిస్తున్నారు. దవాఖానాల్లో అవసరమైన వారికి రెమ్డెసివిర్ ఇంజిక్షన్లు ఇతర మందులు, పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. సర్కారు అందిస్తున్న వైద్యంతో వైరస్ సోకిన వారు కోలుకుంటున్నారు. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మాస్కులు ధరించడం, భౌతికదూరం, ఇతర విషయాలను ప్రజలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. అర్హులైన వారందరూ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తున్నారు.
నేటి నుంచి స్క్రీనింగ్ సర్వే
కొవిడ్ నియంత్రణలో భాగంగా అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి స్క్రినింగ్ సర్వే చేపట్టనున్నారు. సర్వేలో భాగంగా పట్టణాలు, గ్రామాల్లో ప్రతి వెయ్యి మంది జనాభాకు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ముగ్గురు సిబ్బంది బృందంగా వ్యవహరిస్తారు. ప్రతి బృందంలో ఏఎన్ఎం లేదా ఆశావర్కర్, పంచాయతీ, రెవెన్యూ, అంగన్వాడీ కార్యకర్తలు, ఐకేపీ, మెప్మా సిబ్బంది ఉంటారు. వీరు ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు. ఇంట్లో ఎవరైనా కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారా అనే వివరాలు తెలుసుకొని నమోదు చేసుకుంటారు. లక్షణాలు ఉన్న వారికి మందులు ఇస్తారు. నాలుగు రోజుల తర్వాత జ్వరం, జలుబు, ఒళ్లునొప్పులు, దగ్గు, ఆయాసం, ఇతర లక్షణాలు తగ్గకపోతే వారిని కొవిడ్ సెంటర్కు తరలించి చికిత్స అందిస్తారు. ప్రతి టీం మూడు, నాలుగు రోజుల్లో సర్వే పూర్తి చేయాల్సి ఉంటుంది.
ప్రాథమిక దశలోనే నివారణ..
ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా సర్వేతో బాధితులకు ప్రాథమిక దశలో చికిత్స అందనుంది. చాలా మంది వ్యాధి లక్షణాలు ఉన్న వారు ప్రారంభంలో పరీక్షలు చేయించుకోవడం, చికిత్స తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. వైరస్ ప్రభావం ఎక్కువై ఛాతిలో ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, శరీరంలో ఆక్సిజన్ పడిపోవడంతో దవాఖానలకు వస్తున్నారు. దీంతో వ్యాధికి చికిత్స అందించడానికి వైద్యులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తున్నది. స్క్రీనింగ్ సర్వేతో వ్యాధి ప్రాథమిక దశలోనే నయం కావడంతో పాటు తగ్గిన వారికి కొవిడ్ సెంటర్లో మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి.