హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): ‘నేను కష్టపడి భూములు కొనుక్కొన్నా. ఆ భూములు అమ్మినవాళ్లు ఇంకా బతికే ఉన్నారు. బండి సంజయ్.. నువ్వు పేర్కొన్న సర్వే నంబర్లో పట్టా భూమి కాకుంటే, సర్వే నంబర్లు తప్పయితే నా అన్ని పదవులకు రాజీనామా చేస్తా. నా మొత్తం ఆస్తిని దానం చేస్తా. నిజం కాకపోతే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తావా?’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సవాల్ విసిరారు. తెలంగాణ సమాజం సిగ్గుపడేలా బండి సంజయ్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడిన శ్రీనివాస్గౌడ్.. ఉద్యమం మీద, తెలంగాణ సమాజం మీద అవగాహన లేని బండి సంజయ్ తమపై ఆరోపణలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామాలు చేయాలంటే వెనక్కిపోయిన నేతలు తమపై విమర్శలు చేయటం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎవడో లుచ్ఛాగాడు రాసిచ్చిన స్క్రిప్ట్ను చదువుతూ తమపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. బీజేపీ నాయకులందరి చరిత్రలు తమ దగ్గరున్నాయని, అవసరమైనప్పుడు బండారం బయటపెడుతామని అన్నా రు. సమావేశంలో ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.