న్యూఢిల్లీ : కరోనాతో పోరాడుతున్న భారత్కు సహాయం అందించేందుకు పలు దేశాలు ముందుకు వస్తున్నాయి. తాజాగా.. ఐర్లాండ్ సైతం భారత్కు 700 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఇతర వైద్య సామగ్రిని భారత్కు పంపిస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం ఉదయం వరకు సామగ్రి భారత్కు చేరుకుంటుందని ఐరిష్ రాయబార కార్యాలయం తెలిపింది. భారత్కు అండగా ఉంటామని.. మహమ్మారిని ఎదుర్కొవడంలో మరింత సహాయం చేసేందుకు చూస్తున్నామని ఐరిష్ రాయబారి బ్రెండన్ వార్డ్ తెలిపారు.
భారత్లోని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. మన ‘ఆరోగ్య వ్యవస్థలో భారతీయ వైద్య నిపుణులు ముఖ్యమైన వారు’ అని అన్నారు. ఇదిలా ఉండగా.. దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆసుపత్రులు నిండిపోగా.. ఆక్సిజన్ కొరత, తదితర వైద్య సదుపాయాల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే యుఎస్, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్, ఇజ్రాయెల్ సహా అనేక దేశాలు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ యూనియన్ ఇప్పటికే అత్యవసర వైద్య సహాయం ప్రకటించాయి.
ఐడీఏ ఐర్లాండ్ భారత డైరెక్టర్ తనాజ్ బుహరివాల్లా మాట్లాడుతూ ఐరిష్ ప్రభుత్వం కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఇండియాకు సహాయం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. భారత్, ఐర్లాండ్ దశాబ్దాలుగా మంచి సంబంధాలను కలిగి ఉన్నాయని, ఈ క్లిష్ట సమయంలో వైరస్కు వ్యతిరేకంగా యుద్ధంలో మద్దతు ఇవ్వడానికి, ఆరోగ్య కార్యకర్తలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉన్నామని బుహరివాల్లా పేర్కొన్నారు.