నెక్కొండ, ఏప్రిల్ 26: జాతీయ ఉపాధిహామీ పథకం అమలులో నిబంధనలకు నీళ్లొదిలి, లక్ష్యానికి తూట్లు పొడిచిన వైనం నెక్కొండలో నిర్వహించిన సోషల్ ఆడిట్ గ్రామసభలో వెల్లడైంది. గ్రామ పంచాయతీ ఆవరణలో సోమవారం సర్పంచ్ సొంటిరెడ్డి యమునారంజిత్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సోషల్ ఆడిట్ గ్రామ సభకు ఎంపీడీవో సాహితీమిత్ర హాజరయ్యారు. ఉపాధి పథకం బిల్లుల చెల్లింపుల్లో తప్పులు దొర్లడం, మస్టర్లు ఒకరికి వేసి మరొకరికి బిల్లులు చెల్లించడం, కొలతల రికార్డులో నమోదు చేసి బిల్లులు చేయాల్సి ఉండగా, కొలతలు లేకుండానే బిల్లులు చెల్లించడం, మొక్కల పెంపకంలో వాచర్లకు బిల్లుల చెల్లింపుల్లో నియమ నిబంధనలను పాటించకుండా ఎక్కువ మొత్తంలో బిల్లు చెల్లించడం వంటివి జరిగినట్లు డీఆర్పీ సతీశ్ తెలిపారు. రైతులు పాంపండ్లు నిర్మించుకుని బిల్లులు చెల్లించగానే వాటిని పూడ్చివేసినట్లు సర్పంచ్తోపాటు టీఏ, ఫీల్డ్ అసిస్టెంట్ తెలిపారు. గ్రామపంచాయతీ కార్యదర్శి పద్మనాభస్వామి దీర్ఘకాలిక సెలవుపై వెల్లడం, గ్రామ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో పంచాయతీ తరఫున రికార్డులను గ్రామసభలో అందించలేకపోతున్నట్లు సర్పంచ్ యమున తెలిపారు. రూ. లక్షకుపైగా నిధుల చెల్లింపుల్లో జరిగిన అవకతవకలను డీఆర్పీ సభ దృష్టికి తీసుకొచ్చారు. టీఏ రజిత, ఫీల్డ్ అసిస్టెంట్ వీరభద్రస్వామి బిల్లుల చెల్లింపుల్లో ఎదురైన సమస్యలు, అభ్యంతరాలను వివరించారు. డీఆర్పీ వెల్లండించిన పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గ్రామసభలో వైస్ ఎంపీపీ రామారపు పుండరీకం, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
కోవిడ్సెకండ్ వేవ్ ఎఫెక్ట్…‘ఏక్ మినీ కథ’వాయిదా .!
IPL 2021: వేదిక మారింది..ఆట మారేనా?