కొండపోచమ్మ సాగర్ నుంచి తరలివచ్చిన గంగమ్మ
ఎర్రటెండలోనూ మంజీరా నదిలో గోదావరి జలాలు
17 రోజులు.. 1600 క్యూసెక్కులు.. 1.5 టీఎంసీలు
వానకాలానికి మునుపే కొత్త చరిత్రను చూస్తున్న రైతులు
సింగూర్ అవసరం లేకుండానే నిజాంసాగర్కు జలకళ
ఆయకట్టుకు పూర్వవైభవం.. సంబురాల్లో రైతులు
నిజామాబాద్, ఏప్రిల్ 22, (నమస్తే తెలంగాణ ప్రతినిధి):‘నిజాంసాగర్ ప్రాజెక్టు పనైపోయింది.. వర్షాలు కురిసి వరద వస్తేనో, సింగూరు దయతలచి నీరిస్తేనో రిజర్వాయర్ నిండేది’ నిన్నటిదాక ఆయకట్టు రైతుల నిర్వేదమిది. కానీ ఇప్పుడు అంతటా జలసవ్వడి. మండుటెండల్లో రాళ్లు తేలే ప్రాజెక్టులో ప్రస్తుతం గోదావరి గలగలలు వినిపిస్తున్నాయి. 1931లో నిర్మాణం పూర్తిచేసుకుని 90ఏండ్ల ప్రయాణం తర్వాత ప్రశ్నార్థకంగా మారిన ప్రాజెక్టు ఇప్పుడు పునరుజ్జీవంతో కళకళలాడుతున్నది. మహోజ్వల జలదృశ్యాన్ని సుసాధ్యం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా మంజీర, గోదావరి నీటితో చారిత్రక నిజాంసాగర్కు పూర్వవైభవం రానున్నది. కొండపోచమ్మసాగర్ నుంచి బయల్దేరిన గోదావరి జలాలు 17వ రోజైన గురువారం నిజాంసాగర్ బ్యాక్వాటర్లో 24కిలోమీటర్లు ప్రయాణించాయి. నాగిరెడ్డిపేట మండలం చీనూరు నుంచి బయల్దేరి ఎల్లారెడ్డి మండలం రుద్రారానికి చేరుకున్నాయి.
దేశంలోనే పేరొందిన భారీ నీటిపారుదల ప్రాజెక్టుల్లో నిజాంసాగర్ ఒకటి. దాదాపు శతాబ్ద కాలపు చరిత్ర గల చారిత్రక ప్రాజెక్టుకు గడిచిన రెండున్నర దశాబ్దాలుగా జలకళ సంతరించుకోవడం కలగానే మిగిలింది. ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలో అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులతో తెలంగాణ ప్రాంతంలో మంజీరా నది బోసిపోతున్నది. వానకాలంలో కురిసే వానలకు రాష్ట్రం మొత్తం వరద నీటితో ఉప్పొంగుతున్నప్పటికీ నిజాంసాగర్ మాత్రం వట్టిపోవడం గడిచిన కొన్నేండ్లుగా ఆయకట్టు రైతులకు అనుభవమే. అతి భారీ వర్షాలు కురిసి మంజీరపై ఎగువన నిర్మించిన ప్రాజెక్టులు ఉప్పొంగితేనే ఈ ప్రాజెక్టుకు జలాలు వచ్చేవి. లేదంటే భారీ ప్రాజెక్టుకు కామారెడ్డి జిల్లాలోని చిన్నపాటి వాగులు, వంకల గుండా వచ్చే చిన్నపాటి ప్రవాహమే దిక్కుగా మారిన గడ్డు పరిస్థితులు. ఈ దయనీయ దుస్థితికి చరమగీతం పాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాంసాగర్ ప్రాజెక్టుకు కొత్త మార్గాన్ని అనుసంధానించారు. మంజీరా నదిలోకి వరద ప్రవాహంతో సంబంధం లేకుండానే కాళేశ్వరం జలాలను తరలించడం ద్వారా చారిత్రక ప్రాజెక్టుకు పాత రోజులు సంతరించుకోనుండడం దగ్గర్లోనే కనిపిస్తున్నది.
17 రోజులు..ఒకటిన్నర టీఎంసీలు..
నిజాంసాగర్ జలశయానికి తరలించిన కాళేశ్వరం జలాలు ఏప్రిల్ 21 సాయంత్రం 5గంటలకే కామారెడ్డి జిల్లా సరిహద్దును ముద్దాడాయి. గడిచిన రెండు రోజుల్లో బ్యాక్ వాటర్ ప్రాంతంలోకి గోదావరి నీళ్లు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ప్రవేశిస్తున్నాయి. గోలిలింగాల నుంచి వస్తున్న కాళేశ్వరం జలాలు ప్రాజెక్టును నింపేందుకు ఉరకలేస్తోంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో నిర్మించిన కొండపోచమ్మ సాగర్కు తరలివచ్చిన గోదారమ్మను కొత్తగా తవ్విన కాలువ ద్వారా హాల్దీవాగు మీదుగా మంజీరా నదికి తరలించి నిజాంసాగర్ ప్రాజెక్టుకు పంపుతున్నారు. మేడిగడ్డలో ఎత్తిపోసిన గోదావరి జలాలు ఎల్లంపల్లి నుంచి మధ్య మానేరు మీదుగా రంగనాయక్ సాగర్కు చేరుకున్నాయి. అక్కడి నుంచి ప్రత్యేకంగా నిర్మించిన పైప్లైన్ ద్వారా కొండ పోచమ్మ సాగర్కు గోదావరి జలాలు ఎత్తిపోశారు. ప్రస్తుతం కొండపోచమ్మ సాగర్లో పుష్కలంగా నీరు నిల్వ ఉంది. ఇక్కడి నుంచి రోజుకు 1600 క్యూసెక్కుల నీటిని హాల్దీ వాగు మీదుగా నిజాంసాగర్కు 17 రోజులుగా ఒకటిన్నర టీఎంసీల నీటిని తరలించారు. సిద్దిపేట, మెదక్ జిల్లాలో హల్దీవాగు ఆధారంగా చేసుకుని నిర్మించిన 32 చెక్డ్యాములు, పలు చెరువులు సైతం కాళేశ్వరం నీటితో నిండిపోయాయి. కొంగొత్త జలకళను సంతరించుకుని ఎండాకాలంలోనూ కొత్తందాలు సంతరించుకున్నాయి. హల్దీవాగు నుంచి మంజీరలోకి ప్రవేశించిన గంగమ్మ నిజాంసాగర్ను కొద్దిరోజుల్లోనే రైతుల అవసరం మేరకు నింపనుంది.
ఎండా కాలంలో జల సవ్వళ్లు
నిజాంసాగర్లో ఏటా వానకాలంలో మంజీర మీదుగా వరద రావడం ఊహించలేనిది. ఒకవేళ సింగూర్ నుంచి నీళ్లు వదిలితే స్వల్పంగా ఇన్ ఫ్లో సాధ్యమయ్యేది. ఇప్పుడేకంగా వానకాలం మాదిరిగా నిజాంసాగర్ ఎగువ ప్రాంతంలో పరవళ్లు తొక్కుతున్నది. అడవుల్లో సెలయేర్ల సవ్వళ్లతో ఎగిరి దుంకుతూ ఎడారి మాదిరిగా మారిన మంజీర రూపును మారుస్తూ ముందుకు కదులుతున్నది. ఎండాకాలంలో నిజాంసాగర్కు భారీగా గోదావరి జలాలు తరలివస్తుండడంతో ఆయకట్టు పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని రైతులు సంబురం వ్యక్తంచేస్తున్నారు. మెదక్ జిల్లాకేంద్రానికి సమీపంలోని బొల్లారం మత్తడి దూకిన గోదావరి జలాలు ర్యాలమడుగు చెక్డ్యాములోకి ప్రవేశించి.. ఇక్కడి నుంచి మంజీరా నదిలోకి వస్తున్నాయి. అక్కడి నుంచి హవేళీ ఘన్పూర్ మండలంలోని కూచన్పల్లి, సర్ధన చెక్డ్యాములను స్మృశిస్తూ నిజాంసాగర్ వైపు జలాలు పరుగులు తీస్తున్నాయి. ఎర్రటి ఎండలో ఎదురెక్కి వచ్చిన గోదావరి జలాలతో మంజీరా నది పరవళ్లు తొక్కుతున్నది. ఏటా ఫిబ్రవరి, మార్చి నెలాఖరుకే ఎడారిని తలపించే వాగులు, వంకలు, మంజీరా నది ఇప్పుడు మండుటెండల్లో జలసవ్వడి చేస్తూ పరుగులు తీస్తుండడం విశేషం.
చారిత్రక ప్రాజెక్టుకు భరోసా..
నిజాంసాగర్ ప్రాజెక్టు గత కొన్నేండ్లుగా వట్టిపోతోంది. ఎగువన ఎడాపెడా నిర్మించిన ప్రాజెక్టులతో చుక్క నీరు మంజీర ద్వారా రాకపోవడంతో నిల్వ సామర్థ్యం దాదాపు పడిపోయింది. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో కురిసే వాన నీరే.. వాగులు, వంకల ద్వారా నిజాంసాగర్కు ఇన్ని రోజులపాటు ఊపిరి పోసింది. పరిమిత వాగులతో నిజాంసాగర్కు వానకాలంలో చేకూరే ప్రయోజనం కేవలం మూడు లేదంటే నాలుగు టీఎంసీలు మాత్రమే. 2020 వానకాలంలో రికార్డుస్థాయిలో కురిసిన వానతో నిజాంసాగర్ పొంగిపొర్లింది. అంతకుపూర్వం ఆరేండ్ల పాటు ఈ ప్రాజెక్టు బోసిపోయింది. కాలం కలిసి వస్తే భరోసా లేదంటే గడ్డు కాలం అన్నట్లుగా కర్షకులకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్న వేళ.. సీఎం కేసీఆర్ ఆలోచనతో కాళేశ్వరం నీళ్లు నేరుగా నిజాంసాగర్కు మళ్లించడం ద్వారా డీలా పడిన రైతులకు ధైర్యం లభించినట్లు అయ్యింది. భూగర్భ జలాలు ఇంకిపోవడంతో బోరుబావుల కింద పంటల సాగు కష్టమైన సందర్భంలో నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు హల్దీవాగు మీదుగా వస్తున్న గోదావరి జలాలతో ఆయకట్టు పొలాలు సస్యశ్యామలం కానున్నాయి.
ఇవి కూడా చదవండి
ఒక్కరోజులో దేశంలో వెలుగుచూసిన కరోనా కేసులు 3,14,835
కరోనా టైం.. మీ టవల్స్ శుభ్రంగానే ఉన్నాయా?