వరంగల్, ఏప్రిల్ 11: ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర చాలా కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, అర్బన్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అన్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు వరంగల్ ఎల్బీ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతితో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి డివిజన్కు ఆర్వో, ఏఆర్వోలను నియమించినట్లు చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఫలితాలు ప్రకటించే వరకూ రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అభ్యర్థుల ఖర్చు, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, తిరస్కరణ, ఉపసంహరణ, పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ, బ్యాలెట్ పేపర్ల తయారీ వంటి కీలకమైన బాధ్యతలు రిటర్నింగ్ అధికారులపై ఉంటాయన్నారు.
నిర్లక్ష్యం చేయకుండా అంకితభావంతో పనిచేయాలన్నారు. ఎలాంటి తప్పులు లేకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. గ్రేటర్ కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి పమేలా సత్పతి మాట్లాడుతూ అధికారులు శిక్షణ ద్వారా సంపూర్ణ అవగాహన పెంచుకుని, ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలని ఆమె సూచించారు. కాగా, అధికారులు నిర్వర్తించాల్సిన విధుల గురించి హైదరాబాద్ నుంచి వచ్చిన మాస్టర్ ట్రైనీలు హరినాథ్రెడ్డి, సత్తిరెడ్డి, చిత్తరంజన్ వివరించారు.
గైర్హాజరైన అధికారులపై చర్యలు
శిక్షణ తరగతులకు గైర్హాజరైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అర్బన్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అన్నారు. మొత్తం 10 మంది రిటర్నింగ్ అధికారులు, 9 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు శిక్షణ తరగతులకు హాజరుకాలేదు. దీంతో ఎన్నికల విధులపై నిర్లక్ష్యం వహించినందుకు వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో గ్రేటర్ అదనపు కమిషనర్ నాగేశ్వర్, సూపరింటెండెంట్లు బాకం సంతోష్ కుమార్, ఆర్వో, ఏఆర్వోలు పాల్గొన్నారు.