చెన్నై: ఐపీఎల్లో అత్యంత నిలకడగా ఆడే టీమ్స్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఒకటి. ముంబై, చెన్నై, ఢిల్లీలాంటి టీమ్స్తో పోలిస్తే పెద్ద స్టార్స్ లేకుండానే సన్రైజర్స్ ఐపీఎల్లో అదరగొడుతోంది. ఆ టీమ్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ మొత్తానికి తమ సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పాడు. ఆదివారం కోల్కతా నైట్రైడర్స్తో తొలి మ్యాచ్ ఆడబోతున్న సందర్భంగా రషీద్ ఖాన్.. ఇండియా టుడే టీవీతో మాట్లాడాడు. 2016లో టైటిల్ గెలిచిన తర్వాత వరుసగా ఐదుసార్లు ప్లేఆఫ్స్ వచ్చిన టీమ్ సన్రైజర్స్ హైదరాబాద్. 2018లో రన్నరప్గా కూడా నిలిచింది. ఇంత నిలకడ ఎలా సాధ్యమైందో రషీద్ చెప్పాడు.
తాము పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోకపోవడమే దీనికి కారణమని అతను అన్నాడు. కోచ్తోపాటు కెప్టెన్ వార్నర్, మిగతా టీమ్ సభ్యులు కూడా ఈ విషయంలో ఏకతాటిపై నిలుస్తారని అతను అన్నాడు. ఓ టీమ్గా పెద్ద లక్ష్యాలను ఎప్పుడూ నిర్దేశించుకోము. ఒక్కో గేమ్ లక్ష్యంగా దిగుతాం. అందులో గెలవడానికి ప్రయత్నిస్తాం. పెద్ద టార్గెట్ నిర్దేశించుకుంటే అది మా ప్రణాళికలను దెబ్బ తీస్తుంది అని రషీద్ అన్నాడు. తాము ఎప్పుడూ ప్లే ఆఫ్స్, ఫైనల్ గురించి ఆలోచించమని, ఆ రోజు మ్యాచ్లో ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్తామని చెప్పాడు. గతేడాది ఇలాగే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లలో ఇలాగే ఢిల్లీ, ముంబై, బెంగళూరులపై గెలిచినట్లు తెలిపాడు.
కెప్టెన్గా వార్నర్ తమ పనిని మరింత సులువు చేస్తాడని కూడా రషీద్ చెప్పాడు. అలాగే పేస్ బౌలర్ నటరాజన్ ముందుగా వికెట్లు తీసి తన పనిని సులువు చేస్తాడని కూడా అన్నాడు. ఐపీఎల్లో 62 మ్యాచ్లు ఆడిన రషీద్ 75 వికెట్లు తీయడం విశేషం. అతని ఎకానమీ రేటు కూడా కేవలం 6 పైనే ఉంది.