‘అనగనగా ఒక భూప్రపంచం. అందులో దట్టమైన అడవులు, జలపాతాలు, సరస్సులు, కొండల మధ్య నుంచి వెచ్చని కిరణాలను ప్రసరింపజేసే సూర్యుడు, నిరంతరం పక్షుల కిలకిలరావాలు. సరిగ్గా అప్పుడొచ్చారు మనుషులు. ఇంకేముంది సర్వనాశనం’.. ఇలాంటి కథ చెప్పాల్సిన పరిస్థితి త్వరలో రానున్నది. ‘అన్ప్లాస్టిక్ కలెక్టివ్’ సంస్థ అధ్యయనం ప్రకారం, మన దేశంలో ఏడాదికి దాదాపు 9.46 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ తయారవుతున్నది. అదంతా పర్యావరణాన్ని, భూమిని కాలుష్యభరితంగా మారుస్తున్నది. ఇది ఇలాగే కొనసాగితే ప్రకృతి అందాలు.. మ్యాగజైన్లు, క్యాలెండర్లకు మాత్రమే పరిమితమయ్యే ప్రమాదం ఉన్నది. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్లో #InOurFilth అనే క్యాప్షన్తో కొత్తగా ఒక ఫొటో ప్రాజెక్ట్ నడుస్తున్నది. దీనికి ప్రాచీ గలాంజ్, కారా తేజ్పాల్ అనే వన్యప్రాణి సంరక్షకులు నాంది పలికారు. దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే, ప్లాస్టిక్ చెత్తను తింటున్న జంతువుల ఫొటోలను తీసి పంపాల్సిందిగా వారు పిలుపునిచ్చారు. అలా వచ్చిన ఫొటోలను వారానికొకటి చొప్పున సాంక్చురీ నేచర్ ఫౌండేషన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు. ఆ ఫొటోల్లో ప్లాస్టిక్ బాటిల్ను తింటున్న పులి పిల్ల, పాలిథిన్ కవర్లతో కడుపునింపుకొంటున్న ఏనుగు, సింగిల్ యూజ్ కర్రీ ప్యాకెట్స్ను ఆరగిస్తున్న వివిధ జంతువులు ఉన్నాయి.