సిటీబ్యూరో, మార్చి30 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం మానవ జీవితం డిజిటల్మయమైపోయింది. స్మార్ట్ ఫోన్ రాకతో మరింత సాఫ్ట్గా.. సులభతరమైపోయింది. ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. విద్య, ఉపాధి, వ్యాపారం, ఆర్థిక లావాదేవీలు, షాపింగ్, వినోదం.. రవాణా ఇలా సమస్త రంగాలకు డిజిటల్ సేవలు విస్తరించాయి. అయితే ఆన్లైన్ సేవలను భారతీయులు ఎలా ఉపయోగించుకుంటున్నారు? అంతర్జాలంలో ఎలాంటి సమాచారాన్ని అన్వేషిస్తున్నారు? వేటికి ప్రాధాన్యత ఇస్తున్నారు? రోజువారీ జీవిత అవసరాల కోసం ఏమేరకు వినియోగించుకుంటున్నారు? ఎటువంటి వినోద కార్యక్రమాలపై మొగ్గుచూపుతున్నారు? తదితర అంశాలపై గూగుల్ సంస్థ ఇటీవల ఓ రిపోర్టును విడుదల చేసింది. అది భారతీయుల ఆలోచనలు.. ఆకాంక్షలకు అద్దం పడుతున్నది. ప్రధానంగా ప్రాంతీయత, ఎక్కడి నుంచి ఏదైనా నేర్చుకోవడం, ఆన్లైన్ షాపింగ్ అనే మూడు విభాగాలుగా ఇండియాకు సంబంధించి నివేదికను రూపొందించగా అందులో అనేక విశేషాలు వెలుగుచూశాయి. ఆ వివరాలు మీ కోసం..
ఆన్లైన్ షాపింగ్.. సేవలు
ఒకప్పుడు ఏదైనా కావాలంటే బజారుకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం కాలు కదపకుండానే అన్ని సమకూర్చుకునే వెసులుబాటు కలిగింది. కొవిడ్ నేపథ్యంలో చిన్నపిల్లల చాక్లెట్ మొదలు టీవీలు, ఫ్రిజ్లు ఇలా ఏ వస్తువునైనా ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఆయా వస్తువులకు సంబంధించి అంతర్జాలంలో నెటిజన్లు విపరీతంగా అన్వేషిస్తున్నారు. గతంతో పోల్చితే ఒక్క నిత్యావసరాల క్యాటగిరీనే 1.7రేట్లు పెరిగింది. ఇక హోమ్ డెలివరీ విభాగంలో 60శాతం, ఆన్లైన్ స్టోర్ 45శాతం వృద్ధి నమోదైంది. ఇక ఆన్లైన్ డాక్టర్ కన్సల్టేషన్ విభాగంలో ఏకంగా 300శాతం వృద్ధి నమోదవడం మరోవిశేషం. పట్టణాలతో పాటుగా గ్రామీణులు సైతం ఆన్లైన్ షాపింగ్కు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తున్నది. ఆన్లైన్ షాపింగ్ కోసం వెతుకున్న వారిలో గ్రామీణులు 45శాతం ఉండటం గమనార్హం.
ప్రాంతీయతకు పెద్దపీట..
ఎంతవారైనా సరే మాతృభాషపై, పుట్టిపెరిగిన ప్రాంతంపై ఎంతో మమకారం ఉంటుంది. ఈ ప్రాంతీయ భావన, భాషాభిమానం భారతీయుల్లో కొంచెం మెండుగానే ఉంటుంది. అదే ట్రెండ్ అంతర్జాలంలోనూ కొనసాగుతుండటం విశేషం. అదీగాక చాలా మంది నెటిజన్లు ప్రాంతీయ వార్తలకే ప్రాధాన్యత ఇస్తుండటం మరో విశేషం. వాయిస్ అసిస్టెంట్ను వినియోగించుకుంటూ భారతీయ నెటిజన్లు తమకు కావాల్సిన సమాచారాన్ని తమ ప్రాంతీయ భాషల్లోనే అన్వేషిస్తున్నారు. ఒకవేళ అదీ కుదరపోతే అనువాద సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. ఇతర భాషల్లోని సమాచారాన్ని మాతృభాషలోకి ట్రాన్స్లేట్ చేసుకొని చదువుకుంటున్నారు. గతేడాది 17బిలియన్ల సార్లు అలా అనువాద ఆప్షన్ను వినియోగించుకోవడం విశేషం. ఇక సికింద్రాబాద్, ఏలూరు, విజయవాడ, కాకినాడ, నంద్యాలకు చెందిన వారే తెలుగులో సమాచారాన్ని ఎక్కువగా తెలుసుకుంటుండటం మరో విశేషం.
వర్క్ ఫ్రమ్ హోమ్కు.. ఆన్లైన్ క్లాసులకు క్రేజ్..
కొవిడ్-19 ఉద్యోగం, పని విధానంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. వర్క్ ఫ్రమ్ హోంకు ప్రాధాన్యత పెరిగింది. అదే మహమ్మారి ప్రైవేట్ ఉద్యోగాల నిర్వహణలో నూతన శకానికి నాంది పలికింది. వర్క్ ఫ్రమ్ హోం విధానంలో ఊహించని వేగాన్ని పెంచింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని పలు వాణిజ్య రంగాలు మహా నగరాల నుంచి పల్లెపల్లెకూ విస్తరిస్తుండగా, ఉద్యోగులు ఎక్కడి నుంచైనా, ఏ దేశం వారికైనా సేవలను అందించే మహదావకాశం ఏర్పడింది. గతంతో పోల్చితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కు భారీగా డిమాండ్ పెరిగింది. అలాంటి ఉద్యోగాలు అన్వేషిస్తున్న వారి సంఖ్య ఏకంగా 140శాతానికి పెరిగింది. ఇక ఆన్లైన్ జాబ్ల కోసం వెతకడంలో 50శాతం వృద్ధి నమోదు కావడంతోపాటు, ఆన్లైన్ బిజినెస్ అవకాశాల కోసం వెతకడం 40శాతానికి పెరిగింది. మరీ ముఖ్యంగా ఇప్పుడు యాప్ ఎలా రూపొందించాలనే అనే అంశాన్ని తెలుసుకునేందుకు సెర్చ్ చేయడం ఏకంగా 75శాతం పెరగడం గమనార్హం. తమ ఆదాయాలను పెంచుకునేందుకు , ఇంటి వద్ద ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనూ ఇండియన్ నెటిజన్లు ముందున్నారు. ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సుల కోసం వెతకడంలో 50శాతం వృద్ధి నమోదు కాగా, ఆన్లైన్ కోర్సుల అన్వేషణలో 85శాతం వృద్ధి నమోదైంది. ఇక ఆన్లైన్లోనే తమ ఉత్పత్తులను ఎలా విక్రయించాలనే అంశంపై వెతకడంలో 65శాతం వృద్ధి నమోదవడం విశేషం.
ఇవీ కూడా చదవండీ..
గని పైకప్పు కూలి ఇద్దరు కార్మికులు దుర్మరణం
మంగళూరు ఎయిర్పోర్టులో 2.8 కేజీల బంగారం సీజ్
ముందుగా కష్టమైన సబ్జెక్టులను ఎంచుకోండి : ‘పరీక్షా పే చర్చ’లో మోదీ