గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విజిలెన్స్ అధికారులు చేపడుతున్న తనిఖీల్లో అక్రమ నల్లాల బాగోతాలు ఒక్కోటి బయటపడుతున్నాయి. ప్రతి అక్రమ కనెక్షన్ వెనుక జలమండలికి సంబంధించిన ఏదోకస్థాయి ఉద్యోగి ఉంటున్నట్లు విజిలెన్స్ దాడుల్లో తేటతెల్లం అవుతుండడంతో అవినీతి అధికారుల్లో అలజడి మొదలైంది. జలమండలి పరిధిలో మొత్తం 22 డివిజన్ల పరిధిలో సుమారు 12 లక్షల మంది వినియోగదారులున్నారు. కొందరు ఒక కనెక్షన్ అనుమతి తీసుకొని అక్రమంగా మరో కనెక్షన్తో నీటిని తోడేస్తున్నట్లు విజిలెన్స్ దాడులతో తెలుస్తోంది.
జలమండలి పరిధిలో సుమారు 1.5-2లక్షల వరకు అక్రమ కనెక్షన్లు ఉన్నట్లు అధికారుల అంచనా. ప్రతి అక్రమ కనెక్షన్ వెనుక సిబ్బంది పాత్ర ఉందనేది బహిరంగ రహస్యమే. అయితే ఒకటిరెండు చోట్ల ఔట్సోర్సింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకున్న అధికారులు ఆ తర్వాత పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ప్రతి ఇంటికి నెలకు 20వేల లీటర్లు ఉచిత నీటిని సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం 20వేల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేసేందుకు జలమండలి వేగంగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా నల్లా కనెక్షన్కు మీటరు తప్పనిసరి. ఒక కనెక్షన్కు మాత్రమే మీటర్ తీసుకొని అక్రమ కనెక్షన్కు మాత్రం ఎలాంటి మీటరు బిగించుకోవడం లేదు. దీంతో అక్రమ నల్లాల ద్వారా 20వేల లీటర్లను చౌర్యం చేసే అవకాశం ఉంది.
మైలార్దేవ్పల్లి, జగద్గిరిగుట్ట పాపిరెడ్డినగర్, బోరబండ శివనగర్లో అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకున్న ముగ్గురిపై మంగళవారం జలమండలి విజిలెన్స్ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అక్రమంగా నల్లా కనెక్షన్లు తీసుకున్నా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకొని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే 9989998100, 9989992268 నంబర్లకు సమాచారమివ్వాలని అధికారులు కోరారు. సమాచారమిచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు.