జోరుగా ప్రజాభిప్రాయ సేకరణ
నగరంలో ముగిసిన కేంద్ర బృందం పర్యటన
కార్పొరేషన్, ఏప్రిల్ 4: కేంద్ర ప్రభుత్వం నగర, పురపాలక సంఘాల్లో చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో భాగంగా కేంద్ర బృందాలు అన్ని మున్సిపాలిటీల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించాయి. ఇందులో భాగంగా మెరుగైన ర్యాంక్ వచ్చేందుకు నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టిసారించి మూడు నెలలుగా ప్రజల అభిప్రాయాలు సేకరించారు. మార్చి 31తో గడువు ముగియగా కరీంనగర్ నుంచి 1.33 లక్షల మంది అభిప్రాయాలు నమోదు చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో 6 వేల మార్కులు ఉండగా వీటిలో ప్రజల అభిప్రాయాలకే సుమారు 1800 మార్కులు కేటాయించారు. మున్సిపాలిటీల్లోని జనాభాలో కనీసం 45 శాతానికి పైగా ప్రజలు నగరపాలక సంస్థ అందిస్తున్న సేవలపై తమ అభిప్రాయాలను నమోదు చేయాల్సి ఉంటుంది. కాగా, నగరంలో మాత్రం 33 శాతం మాత్రమే నమోదైనట్లు సమాచారం. ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో అభిప్రాయాలను సేకరించేందుకు నగరపాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకున్నా వందశాతం నమోదు చేయించలేకపోయారు. మెట్పల్లి, కోరుట్ల వంటి మున్సిపాలిటీల్లో వందశాతం అభిప్రాయాలను సేకరించగా… జగిత్యాల, సిరిసిల్ల మున్సిపాలిటీల్లో 95 శాతానికి మించి అభిప్రాయాలు నమోదు చేయించారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో మెరుగైన ర్యాంక్ రావడానికి నగరపాలక సంస్థ అధికారులు పారిశుధ్యం మెరుగు కోసం అనేక చర్యలు చేపట్టారు. ఆధునిక యంత్రాలను కొనుగోలు చేయడంతో పాటు ఇంటింటా చెత్తను సేకరించేందుకు ప్రస్తుతం ఉన్న రిక్షాల స్థానంలో స్వచ్ఛ ఆటోలను తీసుకువచ్చారు. వీటిలో ముఖ్యంగా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడంతో పాటు రీసైక్లింగ్ చేసే విషయంలో ప్రత్యేక దృష్టిసారించారు. వీటితో పాటు ప్రజలకు మెరుగైన సదుపాయాల కల్పన విషయంలోనూ అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి చర్యలు తీసుకున్నారు.
క్షేత్రస్థాయిలో పర్యటించిన కేంద్ర బృందం
స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీకి సంబంధించి పారిశుధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, తడి, పొడి చెత్త సేకరణ, డంప్ యార్డు, మరుగుదొడ్ల నిర్వహణ, వాహనాల వినియోగం, తదితర అంశాల్లో కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే స్వతంత్ర సంస్థ ప్రతినిధులు పోటీలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలిస్తారు. ఇందులో భాగంగా ఈ సంస్థ ప్రతినిధులు నగరంలో ఇటీవల వారం పాటు పర్యటించి వివిధ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ కోసం నగరపాలక సంస్థ అధికారులు పంపిన వివరాలు క్షేత్రస్థాయిలో కూడా అదే స్థాయిలో ఉన్నాయో? లేదో? ఈ సంస్థ ప్రతినిధులు పరిశీలించి ఆన్లైన్లో వివరాలు నమోదు చేశారు. ప్రస్తుతం సంస్థ ప్రతినిధులు రెండు రోజుల క్రితమే సర్వేను పూర్తి చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈసారి కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ప్రకటించే స్వచ్ఛ సర్వేక్షణ్లో కరీంనగర్కు ఏ ర్యాంక్ వస్తుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇవి కూడా చూడండి..
దీదీ.. మీరు వారణాసిలో పోటీ పడొచ్చు!
ఉద్యోగం నుంచి ప్రొఫెసర్ సాయిబాబా తొలిగింపు