నిరంతరం పర్యవేక్షిస్తున్న అధికారులు
నెలరోజుల్లోగా పనులు పూర్తిచేయాలి
కాంట్రాక్టర్కు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆదేశం
స్టేషన్ఘన్పూర్, ఏప్రిల్ 4 : నియోజకవర్గ కేంద్రమైన స్టేషన్ఘన్పూర్లో రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దినదినాభివృద్ధి చెందుతున్న పట్టణం వ్యాపారపరంగా విస్తరిస్తున్నది. సుమారు 20 వేల జనాభాకుతోడు వాహనాల రద్దీకనుగుణంగా పట్టణంలో రహదారి విస్తరణ లేకపోవడంతో గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. పట్టణంలోని గాంధీ చౌరస్తా నుంచి రైల్వే గేటు వరకు రూ.1.80 కోట్లతో చేపట్టిన రహదారి విస్తరణ పనులను సుమారు 15 నెలల క్రితం ప్రారంభించారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న వారు గ్రామ పంచాయతీకి ఇచ్చిన హామీ మేరకు కొందరు ఇళ్లను వెనక్కి జరిపి కట్టుకోక పోవడంతో మధ్యలోనే పనులు నిలిపివేశారు. దీంతో గ్రామ పంచాయతీ నుంచి సంబంధిత వ్యక్తులకు పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. దీంతో ఇళ్లలో నుంచి వచ్చే మురుగునీరు రోడ్డుపైకి చేరడంతో స్టేషన్ఘన్పూర్ పట్టణం నుంచి జఫర్గఢ్, పాలకుర్తి, చిల్పూర్ మండలాలకు వెళ్లే ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ క్రమంలో రహదారి విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలని పలు రాజకీయ పార్టీలు ఆందోళన నిర్వహించాయి. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, సంబంధిత అధికారులు రంగంలోకి దిగి సంబంధిత ఇళ్ల యజమానులతో చర్చలు జరిపి నచ్చజెప్పారు. దీంతో రోడ్డు విస్తరణ పనులు ఊపందుకు న్నాయి. వారం రోజుల క్రితం ఎమ్మెల్యే రాజయ్య, ఆర్ ఆండ్ బీ పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల అధికారులు రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి పనుల పురోగోతిపై సమీక్షించి వేగవంతం చేశారు.
గడువులోగా పనులు పూర్తి చేయకుంటే కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెడతాం : ఎమ్మెల్యే
నెల రోజుల్లో రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేసి ప్రజల సమస్యను పరిష్కరించాలని ఇటీవల ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కాంట్రాక్టర్ను ఆదేశించారు. గడువులోపు పూర్తి చేయకుంటే తానే స్వయంగా రంగంలోకి దిగి పనులు చేయిస్తానన్నారు. సదరు కాంట్రాక్టర్ లైసెన్స్ను బ్లాక్ లిస్టులో పెడుతామని హెచ్చరించారు. అనంతరం రోడ్డు విస్తరణ పనులను మూడు రోజులుగా ఆయన పర్యవేక్షిస్తున్నారు. దీంతో సంబంధిత అధికారులు స్పందించి ఆదివారం సైతం పరిశీలించారు. గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం సంబంధిత గృహ యజమానులు తమ ఇళ్లను వెనక్కి జరుపుతుండడంతో రోడ్డు విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు మురు గు కాల్వల పనులు సైతం గ్రామ పంచాయతీ అధికారుల పర్యవేక్షణలో వేగంగా జరుగుతున్నాయి.
ఇవి కూడా చూడండి..
లాక్డౌన్ భయంతో ముంబై వీడుతున్న వలస కార్మికులు
మహారాష్ట్రలో రేపటి నుంచి రాత్రి కర్ఫ్యూ.. వారాంతాల్లో లాక్డౌన్