పల్లె ప్రగతి పనుల్లో ముందంజ
తీరొక్క పూలతోప్రకృతి వనం
అన్ని వసతులతో వైకుంఠధామం
ఇంటింటికీ ‘మిషన్ భగీరథ’ శుద్ధజలం
పినపాక, మార్చి 31 : ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఎల్చిరెడ్డిపల్లి పంచాయతీ తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి బాట పట్టింది. పల్లె ప్రగతి నిధులను సద్వినియోగం చేసుకున్న పాలకవర్గం గ్రామాన్ని ముందంజలో నిలిపింది. నాడు కనీసం విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బంది పడిన గిరిజన గూడెంలో నేడు ‘వెలుగులు’ ప్రసరిస్తున్నాయి. గ్రామంలో ఎటు చూసినా పచ్చందాలే దర్శనమిస్తున్నాయి.
ఏడాదిలో రూ.23 లక్షల నిధులు
గ్రామ జనాభా 1,775 కాగా 1,280 మంది ఓటర్లు ఉన్నారు. పంచాయతీలో 848 కుటుంబాలు నివసిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన పంచాయతీ అభివృద్ధికి నెలనెలా రూ.2.50 లక్షల నిధులు విడుదలవుతాయి. ఇలా గతేడాది పంచాయతీకి రూ.23. లక్షల నిధులు విడుదల కాగా పాలకవర్గం దీనిలో 10శాతం నిధులను గ్రీనరీకి, 15శాతం నిధులను పారిశుధ్య నిర్వహణ, 10శాతం నిధులను వీధిలైట్లు, 5శాతం నిధులను పంచాయతీ కార్యాలయ కార్యకలాపాలకు, మిగిలిన నిధులను ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించింది.
ప్రగతి పనులు పూర్తి..
గ్రామంలో రూ.10 లక్షల ఉపాధి నిధులతో వైకుంఠధామం, రూ.2 లక్షలతో డంపింగ్యార్డు నిర్మించారు. రూ.60 వేలు వెచ్చించి గ్రామంలోని పాడుబడిన బావులు, పాత భవనాలను కూల్చివేశారు. రూ.3 లక్షల నిధులతో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయగా దీనిలో 3 వేల మొక్కలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన రూ.7 లక్షల నిధులతో పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్ సమకూరాయి. దీంతో పారిశుధ్య నిర్వహణ సులభమైంది. ట్రాక్టర్ ద్వారా పారిశుధ్య కార్మికులు తడి, పొడి చెత్తను వేరుచేసి డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. ట్యాంకర్ ద్వారా సిబ్బంది మొక్కలకు నీళ్లు పెడుతున్నారు. మిషన్ భగీరథ పథకంతో గ్రామస్తులకు శుద్ధజలం అందుతున్నది. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఉన్న మట్టి రోడ్ల స్థానంలో సీసీ రోడ్లు వేయించాలని ఆయా కాలనీవాసులు కోరుతున్నారు.
నిధులు సద్వినియోగం
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పల్లె ప్రగతి నిధులను సద్వినియోగం చేసుకున్నాం. గతేడాది ప్రభుత్వం మంజూరు చేసిన రూ.23 లక్షల నిధులతో గ్రావెల్ రోడ్లు నిర్మించాం. మొక్కల పెంపకం చేపడుతున్నాం. ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నాం. పంచాయతీ ప్రజల సహకారంతో పంచాయతీని అన్నివిధాలుగా ముందంజలో ఉంచుతున్నాం. గ్రామాన్ని ఇతర గ్రామాలకూ ఆదర్శంగా నిలుపుతాం.
-నూప నాగభూషణం, సర్పంచ్, ఎల్చిరెడ్డిపల్లి